వెలుగులోకి వస్తున్న ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ అవినీతి భాగోతం
ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కోల్ కతా హత్యాచార ఘటన తర్వాత ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోఫ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. కాగా.. సందీప్ కు సంబంధించిన 3 ఫ్లాట్లు, 2 ఇళ్లు, ఒక ఫాంహౌజ్, ముర్షిదాబాద్ లోని మరో ప్లాట్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సందీప్ భార్య సంగీత ఘోష్ కూడా ఆర్జీకర్ ఆస్పత్రిలోనే డాక్టర్ గా విధులు నిర్వహించనట్లు తేలింది.
ప్రభుత్వ స్థిరాస్తుల కొనుగోలు
సందీప్ ఘోష్ దంపతులు తమ పలుకుబడితో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రెండు ప్రభుత్వ స్థిరాస్తులు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, 2021 సంవత్సరంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో తన సతీమణి డాక్టర్ సంగీతా ఘోష్ని అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారని ఈడీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఈడీ అధికారులు సందీప్ ఘోష్, ఆయన సన్నిహితులు, చెందిన ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇకపోతే, డాక్టర్ సందీప్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.