Rains: హిమాచల్‌‌ప్రదేశ్‌లో భారీ వర్షాలతో 32 రోడ్లు మూసివేత

గత కొన్ని రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్ వర్షాలు దంచికొడుతున్నాయి

Update: 2024-09-19 08:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్ని రోజులుగా హిమాచల్‌‌ప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. గురువారం ఉదయం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో రోడ్లపై వర్షపు నీరు భారీగా పారుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అధికారులు మొత్తం 32 రోడ్లను మూసివేశారు. గురువారం ఉదయం, మండిలో 11, కాంగ్రాలో 10, సిమ్లా, కులులో ఐదు, సిర్మౌర్ జిల్లాలో ఒక రహదారిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు సెప్టెంబర్ 25న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం 'ఎల్లో' అలర్ట్‌ను జారీ చేసింది. అధికారుల డేటా ప్రకారం, జూన్ 27న రాష్ట్రంలో రుతుపవనాలు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల కారణంగా 173 మంది మరణించారు, ఇంకా 31 మంది గల్లంతయ్యారు. రాష్ట్రానికి రూ.1,331 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుండి సెప్టెంబర్ 19 వరకు వర్షపాతం 18 శాతంగా ఉంది, రాష్ట్రంలో సగటున 701.7 మిల్లీమీటర్లకు వ్యతిరేకంగా 572.9 మి మీ వర్షపాతం నమోదైంది.


Similar News