ముంబైలో భారీ వర్షాలు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముంబై: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, థానే, రత్నగిరి, పాల్ఘర్, రాయగఢ్ సహా మొత్తం 8 జిల్లాల్లో వానలు పడుతున్నాయి. దీంతో బుధవారం జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఈదురుగాలుల కారణంగా గత 24 గంటల వ్యవధిలో 26 చోట్ల చెట్లు కూలిపోయాయి. ముంబైలోని మలాడ్లో చెట్టు కూలిన ఘటనలో కౌశల్ దోషి అనే వ్యక్తి మరణించాడు. రాష్ట్రంలో వర్షాలు మరో అయిదు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వర్షాలకు ముంబైలోని అండర్ పాస్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. వరద ముంచెత్తడంతో అంధేరీ సబ్వేలో రెండు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. దీంతో బీఎంసీ అధికారులు దీన్ని మూసివేశారు. సబర్బన్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.