శ్వాగ్‌ రివ్యూ: శోధించారు..సాగదీశారు...నిరాశపరిచారు

కొన్ని సినిమాలు చూస్తుంటే.. తెరపై వున్న గందరగోళంతో.. మనసు కాస్త ఉద్రిక్తతకు లోనైతే ఊపిరికూడా ఆడదు... ఇక మన వల్ల కాదు అని ఓపిక నశించిపోయి... థియేటర్‌ నుంచి బయటపడదామంటే.. నష్టమో.. కష్టమో.. రివ్యూ ఇవ్వాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

Update: 2024-10-04 09:37 GMT

కొన్ని సినిమాలు చూస్తుంటే.. తెరపై వున్న గందరగోళంతో.. మనసు కాస్త ఉద్రిక్తతకు లోనైతే ఊపిరికూడా ఆడదు... ఇక మన వల్ల కాదు అని ఓపిక నశించిపోయి... థియేటర్‌ నుంచి బయటపడదామంటే.. నష్టమో.. కష్టమో.. రివ్యూ ఇవ్వాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.. పోనీ ఏదో ఒకటి మనకు తెలిసి మిగిలిన ఈ కాస్త సినిమాలో బ్రహ్మాండం ఏమైనా జరిగి సినిమా అద్భుతంగా మారిపోతుందా.. అంటే అది లేదు. కాని ట్విస్ట్‌ ఏంటంటే నేను వెళ్లింది సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌కి.. సినిమా స్టార్ట్‌ కాగానే థియేటర్‌ గేట్లు మూసివేస్తారు. ఎదో బతిమలాడి గేట్లు ఓపెన్‌ చేయించవచ్చు... కానీ నా టూవీలర్‌ వెహికల్‌ మాత్రం గజిబిజీగా పెట్టిన థియేటర్‌ పార్కింగ్‌లో పెట్టాను. పద్మవ్యూహంలో చిక్కుక్కున్న నా బండి తీసి వెళ్లాలి అంటే సినిమా అయిపోయే వరకు వుండాల్సిందే...ఇక తప్పని సరిగా సినిమా పూర్తయ్యే వరకు థియేటర్‌లోనే వున్నాను.. దాని ఫలితం నిజంగా ఈ మధ్య కాలంలో ఇంతలా మనల్ని తీనేసిన సినిమాను చూడలేదు. ఈ భావోద్వేగాలు.. ఈ కష్టాలన్నీ నాకు శ్వాగ్‌ సినిమా చూసినప్పుడు కలిగిన కష్టాలే.. సరే ఈ సినిమా ఎలా వుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం...

ఇంతకు ముందు రాజ రాజ చోర సినిమాతో జోడి కట్టిన శ్రీ‌విష్ణు, హాసిత్‌ గోలిలు మరోసారి జతకట్టి తెరకెక్కించిన సినిమా శ్వాగ్‌, రీతూ వర్మ, మీరాజాస్మిన్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కథతో సంబంధం లేకుండా నిర్మించే పీపుల్‌ మీడియా అదినేత టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌లతో ఆకట్టుకోని సినిమాలో ఎదో వుంది.. అది మాకు కావాలి అనిపించే విధంగా ఆడియన్స్‌లో ఉత్కంఠరేపిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథ: కథగా చెప్పాలంటే నిజంగా చాలా ఇబ్బందిగా వుంటుంది. ఎందుకంటే ఎన్ని సార్లు చూసిన ఈ కథ అంత కన్‌ఫ్యూజింగ్‌గా తికమకగా వుంటుంది. ఇదే ఈ కథ ప్రత్యేకత. మాతృస్వామం నుండి పితృస్వామంకు మారిన శ్వాగణిక వంశానికి చెందిన సంపదను క్లయిమ్‌ చేసుకోవడానికి ఒక వారసుడు కావాలి. ఆ కుటుంబం కోసం శ్వాగణిక వంశం వద్ద నమ్మకంగా వున్న మరో కుటుంబం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ సంపద మీదే మీరే దక్కించుకోండి అంటూ కొంత మందికి ఉత్తరాలు వస్తాయి. అలా ఆ ఉత్తరాలు అందుకున్న వారిలో భ‌వ‌భూతి (శ్రీ‌విష్ణు), లింగ (శ్రీ‌విష్ణు) అను (రీతూ వ‌ర్మ‌) ఈ సంప‌ద‌కు మేమే వార‌సుల‌మ‌ని వస్తారు. నిజానికి ఈ వారసత్వ సంప‌ద ఎవ‌రిది? ఈ ముగ్గురు కాకుండా మ‌రెవ‌రైనా ఉన్నారా? అస‌లు శ్వాగ‌ణిక వంశం క‌థేమిటి? చివ‌రికి ఈ నిధి ఎవ‌రికి దక్కింది అనేది కథ. ప్లీజ్‌ ఇక ఇంతకు మించి నాకు కూడా అర్థం కాలేదు...నేను కూడా మీకు చెప్పలేను..

విశ్లేషణ: దర్శకుడు ఎంచుకోవడమే కాంప్లికేషన్స్‌ వున్నకథను ఎంచుకున్నాడు. ఇక ఈ కథను ఎలా చెప్పాలో అర్థం కాక సినిమాని మొత్తం గజిబిజిగా, ఆడియన్స్‌ మరింత అయోమయానికి గురయ్యే సన్నివేశాలతో సినిమాను నింపేశాడు. ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం కాదు.. ఎందుకు వాళ్లు ఒక ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళతారో అంతకు మించి అర్థం కాదు. ఆ వృక్షాలేమిటో.. ఆ వంశాలేమిటో దర్శకుడు మనకు మరోసారి బ్రహ్మోత్సవం సినిమా గుర్తుచేశాడు. కథను ఎలా చెప్పాలో దర్శకుడు సరైన స్క్రీన్‌ప్లేతో అల్లుకుని వుంటే కొంతలో కొంతనైనా సినిమా బెటర్‌గా అనిపించేది. తెర నిండా పాత్రలు.. ఆ పాత్రలు మాట్లాడే అర్థం పర్థం లేని సంభాషణలతో సినిమా మొత్తం కంగాళి చేశాడు దర్శకుడు. టీజర్‌, ట్రైలర్‌లో చూపించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో లేదు. అసలు హీరో శ్రీ విష్ణు ఈ కథను ఎలా ఒప్పుకున్నాడు అనే అనుమానం కలుగుతుంది. కథలో గెటప్పుల కోసం మాత్రమే సినిమా ఒప్పుకున్నాడేమో అనిపించింది. కమల్‌హాసన్‌లా ఒకే సినిమాలో నాలుగు పాత్రలు చేస్తే మనకు కూడా పేరొస్తుందని ఆలోచించడే తప్ప.. ఆ పాత్రలు, ఆ గెటప్పులు సినిమాకు ఎంత వరకు అవసరమో ఆలోచించలేదని అనిపిస్తుంది. కథలో సరైన విషయం లేకుండా, స్క్రీన్‌ప్లేలో సత్తా లేకుండా ట్విస్ట్‌లతో మాయా చేయాలనుకున్న దర్శకుడి ఆలోచన ఫలించలేదు. మాతృస్వామం, పితృస్వామ్యం అని మొదలుపెట్టి ట్రాన్స్‌ జెండర్‌ అనే సెన్సిటివ్‌ పాయింట్‌తో కథను ఎండ్‌ చేయాలనుకున్నాడు కానీ అది అంతగా రక్తికట్టలేదు. టోటల్‌గా ప్రేక్షకుడు ఒకటి ఆశిస్తే.. సినిమాలో మరొకటి చూపించి వాళ్లను నిరాశపరిచాడు దర్శకుడు.పస్ట్‌హాఫ్‌ పర్వాలేదనిపించినా, సెకండాఫ్‌ మరీ నెమ్మదిగా నడుస్తుంది. పతాక సన్నివేశాలు కూడా తేలిపోయాయి.

నటీనటుల పనితీరు: విభిన్నమైన కథలను ఎంచుకునే శ్రీవిష్ణు ఈ సారి కింగ్‌ ఆఫ్‌ కంటెంట్‌ అని కొత్త బిరుదును తగిలించుకున్నాడు. అయితే విచిత్రంగా ప్రతిసారి కొత్త కంటెంట్‌ను ఎంచుకునే ఈ హీరో ఈ బిరుదు యాడ్‌ చేసుకోగానే కథ ఎంచుకోవడంలో తడబడ్డాడు. కేవలం గెటప్పుల కోసమే ఈ కథను ఎంచుకున్నాడని అనిపిస్తుంది.నటుడిగా తను వేసిన గెటప్‌లకు మాత్రమే న్యాయమే చేశాడు. అయితే కథ బలంగా వుండి వుంటే ఆయన వేషాలకు ఓ అర్థం వుండేది. ఇప్పుడు అదంతా వృథా ప్రయాసే. రీతూ వర్మ ఫర్వాలేదు. కానీ ఆ పాత్రలో వుండాల్సిన చురుకుదనం ఆమెలో కనిపించలేదు. చాలా కాలం తరువాత మీరాజాస్మిన్‌ తెరపై కనిపించింది... కనిపించింది అంతే.. తప్ప ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. ఇక పీపుల్‌ మీడియా మేకింగ్‌లో చూపించిన రిచ్‌నెస్‌ కథలో లేదు. ఇకనైనా పీపుల్‌ మీడియా వరుస సినిమాలు నిర్మించడమే కాదు సరైన కథలు ఎంచుకోవాలి. కథలపై శ్రద్ధపెట్టాలి.

ఫైనల్‌ పంచ్‌: అంతా వృథా ప్రయాసే

రేటింగ్‌ 1.5/5

Tags:    

Similar News