మెగా హీరో రాంచరణ్ కోసం వికలాంగుడు పాదయాత్ర

టాలీవుడ్ హీరో రాంచరణ్ అంటే తనకు ప్రాణమని, ఆయనకు పిచ్చి అభిమానని వి.రాజు తెలిపాడు.

Update: 2024-08-02 08:09 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: టాలీవుడ్ హీరో రాంచరణ్ అంటే తనకు ప్రాణమని, ఆయనకు పిచ్చి అభిమానని వి.రాజు తెలిపాడు. వికలాంగుడైన రాజు మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను కలవడానికి శుక్రవారం మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరాడు. మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం, బొండా జానంపేట గ్రామానికి చెందిన రాజు, బీఈడీ పూర్తి చేసి, ఇటీవలే డీఎస్సీ రాశాడు. మహబూబ్ నగర్ పట్టణం టీచర్స్ కాలనీలోని వికలాంగుల హాస్టల్ ఉంటున్నాడు.

రాంచరణ్ అంటే నీకు ఎందుకంతగా అభిమానమని రాజుని అడుగగా, ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడన్నారు. రాంచరణ్‌ది సహజ నటన అని, ఆయన నటించిన రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఆయన నటన పతాక స్థాయికి చేరుకుందన్నారు. ఆ రెండు సినిమాలు వంద సార్లకు పైగా చూశానని చెప్పాడు. నటనలోనే కాదు.. నిజ జీవితంలో కూడా తన హీరో సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని నిరూపించుకుంటూనే ఉంటాడని రాజు అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలవడానికి ప్రయత్నిస్తానని, అనంతరం తన హీరో రాంచరణ్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకుంటానని రాజు తెలిపాడు.


Similar News