పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలేవి..?

పోటీ పరీక్షలు అంటేనే అనేక విషయాలపై మంచి పట్టు సాధించాలి. వీటికి సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రైవేట్ పుస్తకాల కన్నా తెలుగు అకాడమీ

Update: 2024-10-09 01:30 GMT

పోటీ పరీక్షలు అంటేనే అనేక విషయాలపై మంచి పట్టు సాధించాలి. వీటికి సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రైవేట్ పుస్తకాల కన్నా తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలను ప్రామాణికంగా భావిస్తారు. పోటీ పరీక్షల నిపుణులు సైతం మొదటగా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాలని సూచిస్తుంటారు. ఎందుకంటే పోటీ పరీక్షలలో వచ్చే మెజార్టీ ప్రశ్నలను తెలుగు అకాడమీ, పాఠశాల బోర్డు, యూనివర్శిటీ పుస్తకాలను ఆధారం చేసుకొని ఇస్తుంటారు. ఇప్పటికే తెలుగు అకాడమీ పోటీ పరీక్షల నిమిత్తం పలు పుస్తకాలను ప్రచురించింది. 

ఈ పుస్తకాలను అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే రూపొందించడం జరుగుతుంది. పైగా ఆ పుస్తకాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసిన పలు ఉద్యోగ ప్రకటనల నిమిత్తం అని, సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ముద్రించడం జరిగిందని ముందుమాటలో స్పష్టంగా పేర్కొంటారు. ఈ పుస్తకాలు రాయడానికి నిపుణులు పలు పుస్తకాలను రెఫరెన్స్‌గా తీసుకుంటారు. ఈ అకాడమీ విషయ కూర్పులో, భాష విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటిస్తూ పుస్తకాలు రచిస్తుంది.

తెలుగు అకాడమీవి ప్రామాణికం కాదా?

2024 జూన్ 9న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అనంతరం ప్రశ్న పత్రానికి ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా 7191 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన టీజీపీఎస్సీ తుది కీ లో రెండు ప్రశ్నలను మాత్రమే తొలగించి ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. కానీ తుది కీ లో దాదాపు 14 ప్రశ్నలకు సమాధానాలు తప్పులున్నాయని ఆధారాలతో అభ్యర్థులు తెలంగాణ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఇందులో కచ్చితంగా 5 నుంచి 6 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలున్నట్లు విషయ నిపుణులు సైతం చెబుతున్నారు. వీటికి రిఫరెన్స్‌గా తెలుగు అకాడమీ పుస్తకాలను, అధికారిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని చూపిస్తూ కోర్టులో సమర్పించారు. వీటికి స్పందనగా హైకోర్టు టీజీపీఎస్సీ బోర్డు‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే బోర్డు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అకాడమీ పుస్తకాలు సరైన పరిశోధన లేకుండా రాసినవనడం చాలా బాధాకరం.

ఈ సమస్య పరిష్కరించకపోతే..

టీజీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు అకాడమీ ప్రతిష్టకు దెబ్బతీయడం ఎంతవరకు సమంజసనీయమని మేధావుల ప్రశ్న? అలాంటప్పుడు ఎంతో వ్యయంతో పుస్తకాలను ముద్రించడం ఎందుకు? గతంలో పలు పోటీ పరీక్షలో అకాడమీ పుస్తకాలను రిఫరెన్స్‌గా ధ్రువీకరించిన బోర్డ్, ఇప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కీ విషయంలో ప్రామాణికం కాదనడం హాస్యాస్పదం. అభ్యంతరాలను అధికారికంగా వనరుల(authentic source)నుంచి మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసిన బోర్డ్ ప్రవేట్ పుస్తకాలను, వికీపీడియాను కూడా రిఫరెన్స్‌గా చూపించడమేంటి? దీంతో అసలు పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు? ఈ సమస్య పరిష్కరించకపోతే రానున్న కొన్ని నెలల్లో బోర్డ్ నిర్వహించే గ్రూప్-3, గ్రూప్-2 పరీక్షల ప్రశ్నల కూర్పు, సమాధానాల విషయంలో సంకట పరిస్థితి ఎదురుకానుంది. ఇప్పటికే గ్రూప్స్, పోలీసు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే చాలామంది అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రమాణికమని చదువుతున్నారు.

గెలుపు ఎవరిది?

పోటి పరీక్షలో ఒక్క మార్క్‌తో అభ్యర్థుల తలరాతలు మారుతాయి. ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కీ విషయంలో టీజీపీఎస్సీ వింత వాదన వల్ల అభ్యర్థుల నష్టపోయే అవకాశం ఉంది. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇప్పటికే గత టీజీపీఎస్సీ బోర్డ్ ఆధ్వర్యంలో 2022 గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. ఇప్పుడు కొత్త బోర్డు ఆధ్వర్యంలో ఇదే గ్రూప్-1 నూతన నోటిఫికేషన్‌లో ఎదురవుతున్న సవాళ్లు మరోసారి అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం మెయిన్స్ ఎంపిక విషయంలో తీసుకొచ్చిన నూతన జీ.వో 29, తప్పుడు కీ, పాత నోటిఫికేషన్ రద్దు, ఎస్టీ రిజర్వేషన్ పెంపు లాంటి సమస్యలు కోర్ట్ పరిధిలో ఉన్నాయి. టీజీపీఎస్సీ వాటినీ పరిష్కరించి అభ్యర్థులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. గతంలో తప్పుడు కీ విషయంలో 2011లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఆరు సంవత్సరాల తరువాత రద్దయి మళ్లీ 2016లో జరిగింది. ప్రస్తుత గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఆ తప్పు జరగకుండా ఉండాలంటే కేసులు పరిష్కరించాక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి. దీనికోసం అభ్య ర్థులు పలు‌మార్లు టీజీపీఎస్సీ కీ వినతి పత్రం ఇచ్చారు. కానీ బోర్డు ఆ దిశలో ఆలోచించకుండా ముందుకెళ్లడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైనది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు న్యాయం కోసం చదువును పక్కనే పెట్టి కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల టీజీపీఎస్సీ బోర్డు, అభ్యర్థుల పక్షాన జరిగిన వాదనలు విన్న హైకోర్ట్ జడ్జి తుది తీర్పును అక్టోబర్ 14 నాటికి రిజర్వ్ చేశారు. ఈ కేసులో తుది తీర్పు ఆసక్తిగా మారింది. ఇది టీజీపీఎస్సీ గెలుపా? లేదా తెలుగు అకాడమీ, అభ్యర్థుల గెలుపా? అన్నట్టు ఉన్నది. ఏది ఏమైనా పోటీ పరీక్షలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం వరించాలంటే అభ్యర్థులు చదువనే యుద్ధం చేయాల్సిందే.

సంపతి రమేష్ మహారాజ్

సామాజిక విశ్లేషకులు

7989579428

Tags:    

Similar News