ఏకాత్మత మానవతా వాది...

మానవజన్మను ఎత్తడం ఎన్నో జన్మల పుణ్యం అంటారు. అలాంటి మానవ జన్మను స్వార్ధకం చేసుకునేది కొందరే.. వారిలో దీన్ దయాళ్

Update: 2024-09-25 00:30 GMT

మానవజన్మను ఎత్తడం ఎన్నో జన్మల పుణ్యం అంటారు. అలాంటి మానవ జన్మను స్వార్ధకం చేసుకునేది కొందరే.. వారిలో దీన్ దయాళ్ ముందు వరుసలో ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికి కుటుంబంతో అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటా యి. కానీ ఈయనకి కుటుంబ ప్రయాణం చాలా తక్కువ. అతి సామాన్య కుటుంబంలో జన్మించి అస మాన్య వ్యక్తిగా ఈయన ఎదిగారు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించడంతో మేనమామ ఇంటిలో పెరిగిన ఈయనకు కాన్పూర్‌లో బీ.ఏ, చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుండి ఆయన జీవిత విధానం, గమ్యం మారిపోయాయి. సంఘ్‌లో పనిచేస్తూనే బీ.ఏ, డిగ్రీ, ఉపా ధ్యాయ శిక్షణ ఎంఏ, ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు.

గాంధీజీ హత్యనేరంపై..

సంఘ్‌ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు ఆయన చదువుకు స్వస్తి పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని లభంపూర్‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియుక్తులైన కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతంలో సంఘ్‌ కార్యక్రమాలను వికసింపజేశారు. అది గమనించిన సంఘ్‌ పెద్దలు ఆయనను ఉత్తరప్రదేశ్‌ ప్రాంత సహ ప్రచారకులుగా నియమించారు. ఆయన సంఘ్‌ కార్యక్రమాలు చూస్తూ నే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఆ ప్రకాశన్‌ ద్వారా రాష్ట్ర ధర్మ అనే ఒక మాస పత్రిక, పాంచజన్య అనే వారపత్రిక, స్వదేశ్‌ అనే దినపత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీనదయాళ్‌ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి! గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌‌పై కూడా మోపి ఆనాటి ప్రధాని నెహ్రూ సంఘ్‌ను నిషేధించారు. ఆ నిషేధాన్ని తొలగించాలంటూ జరిగిన ఉద్యమానికి ఉత్తరప్రదేశ్‌లో దీనదయాళ్‌ నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఈ హత్యానేరంలో సంఘ్‌ పాత్ర లేదని దీనదయాళ్‌‌ పాంచ జన్యలో స్పష్టం చేస్తూ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా రాసిన రాతలకు ఆనాటి ప్రభుత్వం పాంచజన్యను నిషేధించింది. దానికి బదులుగా హిమాలయ అనే మరో వార పత్రికను ప్రారంభించి తన కలంతో నాటి ప్రభుత్వానికి కలవరం పుట్టించారు. ఈ లోగా గాంధీజీ హత్యానేరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

జనసంఘ్‌తో ప్రయాణం

ఆనాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరిస్తున్న, ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి, భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతో కూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌, గురూజీ సహాయాన్ని అర్థించారు. ఆయన కోరిక ప్రకారంగా పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌, జగన్నాథరావు, సుందర్‌ సింగ్‌ భాండారి లాంటి మరికొందరు యువకులను అప్పగించారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న ఏర్పాటు చేసిన జనసంఘ్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్‌ ఎన్నికైనారు. పార్టీ స్థాపించిన మూడు మాసాలకే 1952లో జరిగిన జనరల్‌ ఎన్నికలలో పోటీ చేసిన నాలుగు జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్‌ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందింది. తన ఉనికిని సాధారణ ఎన్నికలలో రుజువు చేసుకోగలిగింది. ఆ తర్వాత కాశ్మీర్‌లో సత్యాగ్రహం చేసిన డాక్టర్‌ ముఖర్జీ అనుమానాస్పద మరణం చెందారు. ఆయన మరణం తర్వాత జనసంఘ్‌ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్టపరచిన ఘనత దీనదయాళ్‌కి, ఆయన సహచరులకు దక్కుతుంది.

వారి నోర్లు మూయించడానికి..

భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మత మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టి తో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. భారతీయ జనసంఘ్‌ అఖిల భారత కార్యదర్శిగా ఎక్కువకాలం పనిచేసిన దీనదయాళ్‌జీ కార్యకర్తల మనోహృదయాలను మలిచి, వారి మనస్సులలో అతి ప్రముఖ స్థానాన్ని చూరగొన్నారు. సుఖమంటే ఏమిటో తెలియక కష్టాలనే చవిచూస్తూ, దేశ సేవకు నిమగ్నమై, దానినే జీవన కార్యంగా స్వీకరించారు. జనసంఘ్‌లో చేరినప్పటి నుంచి మహారథియై పార్టీకి సారథ్యం వహించి, దేశ రాజకీయాలలో జనసంఘ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షులైనారు. కాలికట్‌లో జరిగిన అఖిల భారత జనసంఘ్‌ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తినార్జించారు. ఆ కీర్తే జనసంఘ్‌ సిద్ధాంత వ్యతిరేకుల కిను కకు కారణమైంది. వారి దుష్ట రాజకీయాలకు మహాతపస్వి బలి అయినారు. ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌ సరాయి రైల్వే స్టేషన్‌లో 1968 ఫిబ్రవరి 11న రైలు పట్టాల వద్ద శవమై కనిపించారు. నేటి యువత ఈయనను స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలో ఎన్ని అవరోధాలు అయినా అధికమించవచ్చు.

(నేడు పండిట్ దీన్ దయాళ్ జయంతి)

సేవెళ్ళ మహేందర్

బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

90300 75767

Tags:    

Similar News