పార్ట్ టైం అధ్యాపకులకు అభయహస్తం అందించండి!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో, ఆ పార్టీ నాయకులకు ఎంత పాత్ర ఉందో, దానికి సమానమైన

Update: 2024-10-23 01:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో, ఆ పార్టీ నాయకులకు ఎంత పాత్ర ఉందో, దానికి సమానమైన పాత్రను రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన వారి పాత్ర అంతే ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించి డిక్లరేషన్‌లను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ లాంటివి ముందుగానే విడుదల చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వారు ఇచ్చిన హామీల ప్రకారం, మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ఎటువంటి షరతులు లేకుండా మహిళలందరికీ వర్తింపజేశారు. అలాగే గృహలక్ష్మీ పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు అందజేస్తున్నారు. పేద మహిళలకు 500 రూపాయలకు సబ్సిడీ ద్వారా వంటగ్యాస్‌ను అందించడం మూలంగా పేదవారి ఇండ్లలో వెలుగును నింపే పథకాన్ని కూడా ప్రారంభించారు. నిరుద్యోగ డిక్లరేషన్‌లో భాగంగా ఉద్యోగ క్యాలండర్లను ప్రకటించారు. ఇలా అన్ని రంగాలకు సంబంధించిన విషయాలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యావ్యవస్థలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (Part-Time) గురించి మాత్రం పట్టించుకోకపోవడం ఒక రకంగా ఆ వర్గంలో నిరాశను కలిగిస్తుంది.

నియామకాలు పూరించకపోవడంతో..

గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాలను కావాలనే విస్మరించినట్లు మనకు వారి విధానాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల్లో ఏ ఒక్క వర్సిటీకి కూడా సరైన బడ్జెట్ అందించక ఉన్నత విద్య కుంటుపడే విధంగా చేసింది. వీటిలో ఖాళీలను పూరించేందుకు జాప్యం చేస్తూ అచేతన స్థితిలో పడేసి 10 సంవత్సరాల కాలాన్ని గడిపేసింది. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ప్రోత్సహించి కార్పొరేట్ విద్యావంతులకు వారి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకునే వెసులుబాటును కల్పించింది. 2013 తర్వాత నియామకాలు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పర్మినెంట్ ఫ్యాకల్టీలు లేక ఒప్పం ద, పార్ట్ టైం అధ్యాపకులపై ఆధారపడి విద్యాలయాలను నడిపించే పరిస్థితి ఉంది. నిరుపేద వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు చదువుకునే విశ్వ విద్యాలయాలలో సరైన వసతులు, బోధన సిబ్బంది లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ కుంటుపడటంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంకులలో కూడా తెలంగాణ విశ్వవిద్యాయాలు చాలా వెనుకబడి ఉన్నాయి.

ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా..

తెలంగాణ రాష్ట్రంలో పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో దాదాపు 1700 మంది తాత్కాలిక అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో చాలామందికి గతంలో చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా ఉన్నత విద్యను అభ్యసించాలని అభిలాషతో తమ ఉద్యోగాలను వదిలి పీహెచ్‌డీ, పీడీఎఫ్ లాంటి ఉన్నత డిగ్రీలను పూర్తి చేశారు. ఈ ఉన్నత చదువులే ఈ రోజున వారికి శాపంగా మారాయి. ఎందుకంటే, గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయక, కాలయాపన చేయడం ద్వారా వారికి సకాలంలో విశ్వవిద్యాలయంలో పనిచేసే అవకాశం లభించక, అక్కడే పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరికి సర్వీస్‌కి సంబంధించిన నిబంధనలు లేవు. కనీసం వారికి అసోసియేట్ ‌ప్రొఫెసర్ అయ్యే అవకాశం కూడా కల్పించలేదు. ఎటువంటి ఉద్యోగ భద్రత గాని, ఆర్థిక భద్రత గాని లేదు. వేతన చెల్లింపులలో కూడా ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఒక్కొక్క నియమాన్ని పాటిస్తూ ఉంది. వేతనంలోనూ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వారికి అందించే వేతనం చాలా తక్కువ.

సెలవురోజుల్లో పస్తులే..!

అన్ని యూనివర్సిటీలలో సెమిస్టర్ విధానం ఉండడం మూలంగా దాదాపుగా ప్రతి సెమిస్టర్‌కి 90 రోజుల పని‌దినాలను నిర్ణయిస్తారు. ఈ 90 రోజుల పని దినాల్లో ప్రభుత్వ సెలవులు వచ్చిన పరీక్షలు జరిగినా, పండగలు వచ్చినా, బందులు చేపట్టినా మొదటగా విశ్వవిద్యాలయంలో నష్టపోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే. సెలవు రోజున మిగతా ఉద్యోగస్తులు అందరూ సంతోషంగా గడిపితే ఈ పార్ట్ టైం అధ్యాపకులు మాత్రం ఆ రోజున వేతనం లేదని బాధపడటం గమనించవచ్చు. పైగా ప్రతి సెమిస్టర్‌కి దాదాపుగా నెల రోజుల సెలవులు వస్తాయి. ఈ రోజులలో వారికి వేతనం లభించదు. దీంతో ఈ కాలంలో వారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా సంవత్సరం పొడవునా కేవలం ఆరు నెలల జీతంతో అర్ధాకలితో తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ పనిలో మాత్రం పర్మినెంట్ అధ్యాపకులతో సమానంగా పనిగంటలు కేటాయించడం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం వారికి లభించే కొంత వేతనాన్ని కూడా తగ్గించే ప్రయ త్నంలో ఉన్నతాధికారులు ఉంటారు.

నేటికీ అమలు కాలేదు..

ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అభయహస్తం వారి జీవితంలో వెలుగునిస్తుందని వారు భావించారు. ప్రభుత్వం ఏర్పడగానే తమ సమస్యలను పరిష్కరిస్తుందని భావించారు. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ వారికి ఎటువంటి ప్రతిఫలం లభించలేదు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో భాగంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులకు 50 వేల రూపాయల కనీస జీతం 12 నెలల పాటు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ ఇప్పటికీ ఇది అమలు కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకొని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి సమ స్యను పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగు నింపినట్లుగానే వర్సిటీల్లోని పార్ట్ టైమ్ అధ్యాపకులపై కూడా తమ దృష్టిని కేంద్రీకరించాలని ఆశిద్దాం.

- డాక్టర్. ఏ శంకర్

డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి

99514 50009

Tags:    

Similar News