'గులాబీ' పార్టీ కోలుకోవడం కష్టమే!

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పదేళ్ల కిందట భారత్ రాష్ట్ర సమితికి (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి) అలాగే

Update: 2024-06-08 00:30 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పదేళ్ల కిందట భారత్ రాష్ట్ర సమితికి (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి) అలాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి కూడా ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటమే అనుకునేవాళ్లు. అంతటి ఘన చరిత్ర గల గులాబీ పార్టీ ఇవాళ ఉనికి కోసం పోరాడుతోంది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చెరో ఎనిమిది సీట్లు తెచ్చుకుని సమ ఉజ్జీలుగా నిలిచాయి.

తెలంగాణ రాజకీయాలను దశాబ్దం పాటు శాసించిన బీఆర్ఎస్ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గులాబీ పార్టీ బొక్కబోర్లా పడి కనీసం బోణీ కూడా చేయలేకపోయింది. ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీలో పరిస్థితులు తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమాత్రం ఊహించలేదు. కచ్చితంగా తాము హ్యాట్రిక్ కొడతామని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. దీంతో జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ సహా అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఒక దశలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ పేరుతో కూటమి కట్టడానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు. అయితే అనేక కారణాలతో ఈ కూటమి ఏర్పాటు వర్క్ అవుట్ కాలేదు. అది వేరే సంగతి.

ఒక్క ఎంపీ సీటూ దక్కలే..!

ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా గులాబీ నాయకులు పార్టీని వీడటం మొదలెట్టారు. గేట్లు ఓపెన్ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేయడంతో వలసలు మరింత జోరందుకున్నాయి. వరంగల్ నియోజకవర్గానికి కడియం కావ్యకు బీఫామ్ ఇస్తే చివరి క్షణంలో పోటీ చేయడం లేదంటూ కడియం కావ్య రాజకీయంగా యూ టర్న్ తీసుకున్నారు. అంతిమంగా కాంగ్రెస్ టికెట్‌పై అదే వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కడియం కావ్య విజయం సాధించారు. గులాబీ పార్టీ దయనీయ పరిస్థితికి ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నడూ ఊహించి ఉండరు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో రానున్న కాలంలో వలసలు మరింత జోరందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చరిత్ర సృష్టించిన బీజేపీ

తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందనే చెప్పవచ్చు. మొత్తం 17 సెగ్మెంట్లలో ఒక సీటు మజ్లిస్ పార్టీ గెలుచుకోగా మిగతా 16 సెగ్మెంట్లలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ చెరి ఎనిమిది సెగ్మెంట్లను గెలుచుకున్నాయి. అంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ ఎదిగిందన్న సంకేతాలు అందాయి. అయితే కమలం పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకోవడం ఒక అనూహ్య పరిణామమే. తెలంగాణ చరిత్రలో కమలం పార్టీకి ఇంత భారీ సంఖ్యలో సీట్లు దక్కడం ఇదే మొదటిసారి.

ప్రతిపక్షంలో ఉండి కూడా బీజేపీ ఈ స్థాయిలో సీట్లు సంపాదించుకోవడాన్ని ఒక విజయంగానే చూడాలి. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా హస్తం పార్టీ కనీసం రెండంకెల సీట్లు తెచ్చుకోకపోవడం కాంగ్రెస్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు ఆశించింది కాంగ్రెస్ అధిష్టానం కానీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి ఎంతమాత్రం ఆమోదం కాకపోవచ్చు. మొత్తంమీద తెలంగాణ వరకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయే విజేతగా నిలిచింది.

- ఎస్‌. అబ్దుల్ ఖాలిక్

సీనియర్ జర్నలిస్ట్

63001 74320

Tags:    

Similar News