స్తూపం చేసిన హృదయావిష్కరణ

తెలంగాణలో చారిత్రక నిర్మాణమై నిలిచి, పేల్చివేయబడి శిధిలమైన స్తూపం వద్ద ప్రజాయుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభ ఇటీవల పాత కరీంనగర్ ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌లో జరిగింది.

Update: 2024-08-18 01:00 GMT

తెలంగాణలో చారిత్రక నిర్మాణమై నిలిచి, పేల్చివేయబడి శిధిలమైన స్తూపం వద్ద ప్రజాయుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభ ఇటీవల పాత కరీంనగర్ ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌లో జరిగింది. మూడు దశాబ్దాల క్రితం విప్లవకారుల స్మృతిలో నిర్మించిన స్తూప ఆవిష్కరణలో పాల్గొన్న గద్దర్‌ను అక్కడే స్మరించుకోవడం సబబని భావించిన నిర్వహణ కమిటీ చొరవ చేసి సభను శిథిలమైన స్తూపం వద్ద ఘనంగా జరిపింది. ఇందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంపచెట్లతో పడావు పడిన ప్రాంతాన్ని దశాబ్దాల కాలం తర్వాత శుభ్రం చేసి మరీ సభ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమరుల త్యాగాలు ఎప్పుడు గుబాళిస్తూనే ఉంటాయి. త్యాగాల నిలువెత్తు సాక్షాలుగా స్తూపాల రూపంలో ప్రేరణ ఇస్తూనే ఉంటాయి. పోరాట, ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో, పల్లెలలో సజీవంగా చాటుతూనే ఉంటాయి. వారి త్యాగాల పోరాట స్ఫూర్తిని గుండెలలో నింపుతూనే ఉంటాయి. చెరిపివేయలేని చరిత్రకు సాక్ష్యాలుగా ప్రేరణ కలిగిస్తుంటాయి. అలాంటి వాటిలో అత్యంత ఖ్యాతి పొందినది హుస్నాబాద్ అమరుల స్తూపం.

చైనాలోని తీయనాన్మెన్ స్క్వేర్‌లో నిర్మించిన స్తూపం తర్వాత ఆసియా ఖండంలో నిర్మించిన అతి పెద్ద రెండవ స్తూపం హుస్నాబాద్‌లో నిర్మించిన విప్లవ అమరుల స్తూపం. 1989 నుండి ఏడాది పాటు పీపుల్స్ వార్ పార్టీ సానుభూతిపరులు, మిలిటెంట్లు రైతు కూలీలు పైసా పైసా పోగేసి నిర్మించిన స్తూపం ఇది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ స్తూపంగా 88 అడుగుల ఎత్తులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది మంది శ్రమదానంతో, ప్రేమగా నిర్మించుకున్న స్తూపం.

కూలిన స్తూపం వద్ద భావోద్వేగాలు..

స్తూప నిర్మాణం జరిగి నేటికి 33 ఏళ్లు. కొద్ది కాలంలోనే గ్రీన్ టైగర్స్ పేరుతో స్తూపాన్ని డైనమెట్లతో పేల్చివేశారు. ఆ శిథిలాలు మాత్రం పోరాట వీరుల త్యాగాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పీపుల్స్ వార్ పార్టీకి కాస్త స్వేచ్ఛా కాలం ప్రకటించడంతో, కరీంనగర్ పీపుల్స్ వార్ పార్టీ జిల్లా కార్యదర్శి సందె రాజమౌళి పర్యవేక్షణలో హుస్నాబాద్ స్తూప నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టి, పలు చర్చలకు వీలు కల్పించిన ఈ స్తూపాన్ని అమరుడు పులి రాములు తండ్రి పులి మల్లయ్య ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, విప్లవ కవి వరవరరావు, పౌర హక్కుల నేత బాలగోపాల్ వంటి ప్రముఖులు, జననాట్యమండలి నుంచి సంజీవ్, డప్పు రమేష్, దివాకర్, వంగపండు, రాజనర్సింహ లాంటి కళాకారులు ఎందరో ఉద్యమకారులు, అమరుల బంధుమిత్రులు, ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆ స్మరణ అజరామరంగా కదలాడుతూనే ఉన్నది. కూలిన శిధిలాల మధ్యకు వెళ్లిన అమరుల, బంధుమిత్రుల, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న ప్రజల భావోద్వేగంతో కూడిన ఆందోళన వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది.

స్తూపం వద్దే సంస్మరణ సభ

ఆగస్టు ఆరో తారీఖున గద్దర్ సంస్మరణ సభ ఈ స్తూపం వద్దనే జరపడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. గద్దర్ వర్ధంతి సభ నిర్వాహణకు అధ్యక్షులుగా కవ్వ లక్ష్మారెడ్డి, కన్వీనర్‌గా మేకల వీరన్న యాదవ్‌లతో కమిటీ ఏర్పడి హుస్నాబాద్ స్తూపం వద్ద పెరిగిన కంపచెట్లను తొలగించి, సమాంతరంగా చదును చేసి, పూర్తిగా శుభ్రం చేసి అక్కడే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మట్టిలో కూరుకుపోయిన క్వింటాళ్ల బరువున్న సుత్తి కొడవలి కి ఎర్ర రంగు వేసి నిలబెట్టారు. అనేక ఆటంకాలు, తొలగని భయాందోళన మధ్య సభా వేదిక ఏర్పాటు చేసి గద్దర్ సంస్మరణ సభను, అమరుల సంస్మరణ సభలా నిర్వహించారు. అమరుల స్తూప శిథిలాల దగ్గర నిర్వహించిన ఈ సభకు అమరుల కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ జ్ఞాపకాలను తలపోసుకున్నారు. కూల్చిన స్తూపాన్ని తిరిగి నిర్మించాలని సభకు వచ్చిన ప్రజలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రాలు అందజేశారు. దశాబ్దాల కాలం పాటు, కంపచెట్ల మధ్య కనిపించకుండా ఉండిపోయిన స్మారక స్తూపం జ్ఞాపకాలు, రూపాన్ని ప్రజలు చూసి ఉద్విగ్నతకు లోనయ్యారు. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఫోటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. త్యాగ మూర్తులను మదిలో తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. అయినా, వారి ముఖాల్లో ఏదో తెలియని ఆనందం తొణికిసలాడింది. కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు తమ ఉద్యమాల్లో, పోరాటాలలో అమరుల స్మృత్యర్థం స్తూపాలు నిర్మించడం ఆనవాయితీ. ప్రజల హక్కుల కోసం, వనరుల రక్షణ కోసం, స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, దోపిడీ పీడనలకు వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన వారి గుర్తులే స్తూపాలు.

అమరుల స్వప్నాలు.. చెరగని సత్యాలు

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తెలంగాణలో నిర్మించిన స్తూపాలు గ్రామగ్రామాన దర్శనమిస్తూనే ఉంటాయి. నక్సల్‌బరి ఉద్యమం ఒరవడిలో పీపుల్స్ వార్ (మావోయిస్టు పార్టీ), జనశక్తి పార్టీలు వారు పని చేసిన ప్రాంతాలలో వేలాది స్తూపాలు నిర్మించడం చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు స్తూపనిర్మాణ సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నాయి. ఇది తెలంగాణకే పరిమితం కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులు, ఆదివాసీలు వేలాది స్తూపాలు నిర్మిస్తూనే వచ్చారు. అమరుల త్యాగాల గుర్తులను చెరిపేయడం కోసమే పాలకులు వాటిని కూల్చివేయడం కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే పీడిత ప్రజలతో పెనవేసుకుపోయిన వారి బాంధవ్యాలు మాత్రం జనం గుండెల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి. చెరిపేస్తే చెరగని సత్యాలుగా అమరుల స్వప్నాలు మేలుకొలుపుతూనే ఉంటాయి. ప్రజలే చరిత్ర నిర్మాతలని రుజువు చేస్తున్నాయి.

- రమణా చారి,

99898 63039

Tags:    

Similar News