ఎస్‌జీటీలపై వివక్ష ఇంకెన్నాళ్లు..?

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యావ్యవస్థలో అధిక సంఖ్యలో ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులపైన అంతులేని వివక్ష కొనసాగుతున్నది.

Update: 2024-09-18 01:00 GMT

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యావ్యవస్థలో అధిక సంఖ్యలో ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులపైన అంతులేని వివక్ష కొనసాగుతున్నది. పాఠశాల విద్యావ్యవస్థకు పునాది అయినా ప్రాథమిక పాఠశాలలను సంరక్షిస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు అటు పదోన్నతుల్లో ఇటు వేతన స్థిరీకరణలో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఉపాధ్యాయ సంఘాలకు సభ్యత్వాలు ఇవ్వడంలో వివిధ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలకు ముందు వరుసలో ఉండే వీరిని అటు ప్రభుత్వం, ఇటు సంఘాలు పట్టించుకోకపోవడం వల్ల వారి సమస్యలు తీరక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం, ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉండాలనే అశాస్త్రీయమైన నిబంధన వల్ల ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. రాష్ట్రంలోని సింహభాగం ప్రాథమిక పాఠశాలలో సగటున ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గిందని ఉన్న రెండు పోస్టుల్లో ఒకటి తీసేస్తారు లేదా డిప్యూటేషన్ పంపిస్తారు. గ్రామంలోని తల్లిదండ్రులు ఒక్కరితో బడి ఎలా నడుస్తుందని వారి పిల్లలను ప్రైవేట్ బడులకు పంపిస్తున్నారు. చివరకు పిల్లల సంఖ్య జీరో అయిందని ఆ బడి మూసివేసే పరిస్థితి వస్తున్నది. ఇలా రాష్ట్రంలో గత మూడేళ్లలో దాదాపుగా 1500 ప్రాథమిక పాఠశాలలను జీరో విద్యార్థుల నమోదు కారణం చేత మూసివేశారు. 317జీవో, ఇటీవల జరిగిన బదిలీల వల్ల రాష్ట్రంలో 20% పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయి. విద్యాహక్కు చట్టం నిబంధనలు సవరించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఇచ్చి పనిభారం తగ్గించాలని ఎస్‌జీ‌టీ ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.

పదోన్నతులలో తీవ్ర అన్యాయం!

పాఠశాల విద్యావ్యవస్థలో 65 వేల పైగా ఉన్న ఎస్జీటీలకు ఇటీవల జరిగిన పదోన్నతులలో తీవ్ర అన్యాయం జరిగినది. ఉద్యోగులకు సంబంధించి వివిధ క్యాడర్లలో రెండేళ్లకే పదోన్నతి వస్తే ఎస్‌జీ‌టీ ఉపాధ్యాయులకు మాత్రం 20-25 ఏండ్లు గడిచిన పదోన్నతి అందని ద్రాక్షగా మారినది. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో అదనపు విద్య అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. కానీ ఆ తర్వాత దాన్ని రద్దు చేయడం వల్ల ఉద్యోగ కాలంలో వచ్చే నాలుగు ఇంక్రిమెంట్లను ఎస్‌జీటీలు కోల్పోయారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎస్జీటీలకు నెలకు రూ.125 అదనపు అలవెన్స్ ఇస్తున్నారు. ఇంత తక్కువ భత్యం ఇవ్వడం తమను అత్యంత దారుణంగా అవమానించడమే అని ఎస్‌జీ‌టీ‌లు వాపోతున్నారు. అలాగే ఇటీవల జరిగిన పండిత పీ‌ఈ‌టీ అప్‌గ్రేడేషన్‌లో అన్ని అర్హతలు ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు దక్కకపోవడం వలన ఎస్జీటీలు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రతి పీఆర్సీలోను అన్యాయమే..!

రాష్ట్రంలో సింహభాగం ఉన్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ప్రతి వేతన సవరణలో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఒకే విద్యా ‌అర్హతలు కలిగి పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఎస్‌జీటీ‌లకు వేతన వ్యత్యాసం అంతకంతకు పెరుగుతున్నది. 2010 పీఆర్సీలో ఎస్‌జీటీ‌లకు రూ. 10,900 ఉండగా స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860గా ఉంది. కానీ 2015 పీఆర్సీలో ఎస్‌జీటీ‌లకు జీతం రూ. 21,230 ఉండగా స్కూల్ అసిస్టెంట్లకు రూ. 28,940కి పెరిగినది. 2020 పీఆర్సీలో ఎస్‌జీటీ‌ల జీతం రూ. 31,040కి పెరగగా స్కూల్ అసిస్టెంట్ల జీతం రూ. 42,300 అయినది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఇవ్వనున్న రెండవ వేతన సవరణలో భాగంగా ఉపాధ్యాయ సంఘాలు ఎస్‌ఏ‌ల జీతం 77 వేలకు పైగా ప్రతిపాదించగా ఎస్జీటీల వేతనంను కేవలం 62000 మాత్రమే ప్రతిపాదించాయి. వీరికి ఇటు సంఘాలు అటు ప్రభుత్వం వేతన స్థిరకరణలో తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.

ఓటు హక్కు కల్పించాలి!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడం వల్ల ఎస్జీటీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కావున మొదటగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న అందరి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. అలాగే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ల వేతన వ్యత్యాసం తగ్గించి పీఆర్‌సీ‌లో బేసిక్ జీతం పెంచాలి. 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఎస్‌జీటీ ఉపాధ్యాయుడికి స్కూల్ అసిస్టెంట్ హోదా ఇవ్వాలి. అలాగే 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్‌జీ‌టీ‌కి జీహెచ్ఎం హోదా ఇవ్వాలి. విద్యా హక్కు చట్టం నిబంధనను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయించి ఎస్‌జీటీల పనిభారాన్ని తగ్గించాలి. అలాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుని నియమించాలి. ఎస్‌జీటీ ఉపాధ్యాయుడికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్న ఎఫ్.ఎల్.ఎన్, సీసీఈ కార్యక్రమాలను రద్దు చేయాలి. పాఠశాల విద్యలో పునాది అయిన ప్రాథమిక విద్యను సంరక్షిస్తే నేటి బాలలు రేపటి భావి భారత పౌరులుగా ఎదుగుతారు.

- అంకం నరేష్

63016 50324

Tags:    

Similar News