బెట్టింగ్ సరదా గేమ్ కాదు.. వ్యసనం!

బెట్టింగ్ లేదా జూదం ప్రపంచవ్యాప్తంగా వినోదం, లాభం కోసం ఆడతారు. కొంతమంది దీనిని సరదాగా ఎంటర్టైన్మెంట్

Update: 2025-04-04 01:15 GMT
బెట్టింగ్ సరదా గేమ్ కాదు.. వ్యసనం!
  • whatsapp icon

బెట్టింగ్ లేదా జూదం ప్రపంచవ్యాప్తంగా వినోదం, లాభం కోసం ఆడతారు. కొంతమంది దీనిని సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకుంటారు, కానీ మరికొందరు దీన్ని బలమైన అలవాటుగా చేసుకొని వ్యక్తిగత, ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అయితే, యాదృచ్ఛికంగా బెట్టింగ్ కడితే అది మానసిక వ్యాధి కాదు, కానీ అది అడ్డు అదుపు లేకుండా అలవాటుగా మారినప్పుడు మాత్రమే దీన్ని గాంబ్లింగ్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతగా మానసిక వైద్య నిపుణులు గుర్తించారు. 

ఇటీవలి సంవత్సరాల్లో పందెం, జూదం యువతలో విపరీతంగా పెరుగుతున్నాయి. "పందెం ఒక చిన్న అలవాటు మాత్రమే" అని మొదట్లో భావించినా, అది పూర్తిగా జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన మార్గం కావొచ్చు. స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్‌లైన్ క్యాసినోలు, గేమింగ్ బెట్స్ లాంటి పందెంలు యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

అలవాటయ్యే విధానం..

మొదటగా, వ్యక్తులు సహచరుల ఒత్తిడితో లేదా ఆసక్తితో బెట్టింగ్ లేదా జూదం ఆడటం/ బెట్టింగ్ కట్టడం ప్రారంభిస్తారు. తర్వాత వినోదాత్మక దశ మొదలవుతుంది. క్రమంగా వివాహాలు, ఫంక్షన్లు, కాలేజ్ డే పార్టీలు, సమావేశాలు, సెలవు దినాల్లో త‌ర‌చుగా బెట్టింగ్ ఆడటం పెరుగుతుంది. చివరిది కంపల్షన్ దశ. కొన్ని సందర్భాల్లో, అప్పుడప్పుడూ బెట్టింగ్ లేదా జూదం ఆడే వ్యక్తులు రోజూ లేదా ఎక్కువ టైమ్ ఇందులోనే గడుపుతారు. ఈ దశలో ఆడటం లేదా పాల్గొనకపోతే ప్రశాంతంగా ఉండలేకపోతారు, ఫలితంగా పదేపదే అదే మాయలో చిక్కుకుంటారు. ఇందులోంచి బయటకు రావడానికి ప్రయత్నించినా విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువ.

బెట్టింగ్ బాధితుల లక్షణాలు..

నియంత్రణ కోల్పోవడం వీరు పందెం ఆపాలని ప్రయత్నించినప్పటికీ ఆపలేక మళ్ళీ మళ్ళీ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. పందెంపై మక్కువతో ఎప్పుడూ పందెం గురించే ఆలోచించడం, గత విజయాలను లేదా పరాజయాలను గుర్తు చేసుకుంటుంటారు. నష్టాలను తిరిగి సంపాదించాలని ప్రయత్నించి పోయిన డబ్బును తిరిగి సంపాదించాలని మరింత ఎక్కువగా పందెం వేస్తారు. పందెం గురించి కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం లేదా అబద్ధాలు చెప్పడం. బెట్టింగ్ డబ్బుల కోసం రుణాలు తీసుకోవడం లేదా దొంగతనానికి పాల్పడడం వీటన్నింటి వల్ల వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం కుటుంబ, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

అప్పుల నుంచి ఆత్మహత్యలు ...

ఇలా బెట్టింగ్‌లకు పాల్పడే యువత ఎప్పుడూ గెలిచే అవకాశం ఉండదు. ఓడిపోవడం వల్ల అతిగా నిరాశ, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం జరుగుతుంది. ఇది డిప్రెషన్, ఆంగ్జైటీ, మెదడు పనితీరులో మార్పులు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది యువత బ్యాంక్ లోన్లు కాకుండా ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేస్తారు. తిరిగి చెల్లించలేకపోతే రుణదాతల నుండి మానసిక, శారీరక వేధింపులు ఎదుర్కొంటారు. ఈ భయంతో ఆత్మహత్య చేసుకునే ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొందరేమో కుటుంబ, సమాజ ఒత్తిళ్లను తట్టుకోలేక మరణాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకొం దరు పందెంలో ఓడిన బాధను మరిచిపోవడానికి మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు. దీని ఫలితంగా ఆరోగ్య సమస్యలు, మరణాలు, ఆత్మహత్యలు సంభవించే ప్రమాదం ఉంటుంది.

పరిష్కార మార్గాలు..

ప్రస్తుతం రాష్ట్రాలకు జూదం, బెట్టింగ్‌లను నియంత్రించే అధికారం ఉంది. కానీ చాలా కంపెనీలు రాష్ట్రాల, దేశం సరిహద్దు వెలుపల ఉన్నాయి, కాబట్టి ఒక రాష్ట్రం ఎంత వరకు నియంత్రించగలుగుతుందనేది ప్రశ్న. అందుకోసం దేశం మొత్తంగా ఆదర్శంగా వాటిని కేంద్ర స్థాయిలోనే నియంత్రించడం లేదా నిర్మూలించడం చేయాలి. అలాగే పందెం వ్యసనం ప్రమాదకరమనే విషయంపై విద్యాసంస్థలు, మానసిక నిపు ణులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యువత ఒత్తిడిని జయించేందుకు మానసిక సలహాలు అందించాలి. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పందెం అలవాటు ఉందని గమనించిన వెంటనే సహాయం అందించాలి. అవసరమైతే కౌన్సెలింగ్ కూడా అందించాలి. పందెం సరదా ఆటగా మొదలై, జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకర వ్యసనంగా మారుతోంది. ఈ బెట్టింగ్ మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం, కుటుంబ సభ్యులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానసిక వైద్య రంగ నిపుణులు కలిసి భారీ ఎత్తున అవగాహన కల్పించాలి, పందెం ఓ ఆట కాదు – అది జీవితాన్ని నాశనం చేసే విష పాము. బాధ్యతగా ఆలోచిద్దాం, మన యువతను మనం కాపాడుకుందాం.

డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Tags:    

Similar News