విద్యారంగ సమస్యలపై గళమెత్తుతూ..

అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్‌షిక్ మహాసంఘ్ (ABRSM) అనే జాతీయ అధ్యాపక సంఘం, జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా రంగంలో, అధ్యాపకుల,

Update: 2024-09-20 00:30 GMT

అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్‌షిక్ మహాసంఘ్ (ABRSM) అనే జాతీయ అధ్యాపక సంఘం, జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా రంగంలో, అధ్యాపకుల, విద్యార్థుల, విద్యాసంస్థల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ నిరంతరం వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నది. ఈ సంస్థ విద్య, సామాజిక రంగంలో సాంస్కృతిక జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నది. జాతీయత అనే భావజాలంతో పనిచేస్తున్న ఈ సంస్థ ప్రీ ప్రైమరీ స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉపాధ్యాయుల శ్రేణిని కలిగి ఉన్న ఈ సంస్థ 1988లో స్థాపితమైంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో విస్తరించి దాదాపు 12 లక్షల మంది సభ్యత్వంతో విద్యారంగ సమస్యలపై, అధ్యాపకుల సమస్యలపై అనేకమార్లు విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నది.

ఈ సంస్థ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధ్యాపకులను ఒకే వేదిక కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ప్రీ ప్రైమరీ నుండి విశ్వవిద్యాలయాల అధ్యాపకుల విద్యా, ఆర్థిక, సామాజిక స్థితిని మెరుగుపరచడం, ప్రభుత్వానికి విజ్ఞాపన ద్వారా అందించి అవసరమైతే శాంతియుత మార్గాల ద్వారా పోరాటం చేసి వాటిని పరిష్కరించడం చేస్తుంది. ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం ఏర్పాటులో తన సహాయ, సలహాలను, సూచనలను సంస్థ ఎప్పటికప్పుడు అందించింది. దాంతో పాటు ప్రతి రాష్ట్రంలో అదే విధంగా దేశంలోని వివిధ ప్రధాన పట్టణాలలో ఏబీ ఆర్ఎస్‌యం తరపున నూతన విద్యావిధానం అమలు దానిలోని లోటుపాట్లు, దానిలోని లాభాలను క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విధంగా జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి సెమినార్లను నిర్వహిస్తున్నది.

విద్యావిధానంపై నిక్కచ్చిగా అభిప్రాయాలు..

నూతన విద్యావిధానంలో వచ్చే మార్పులపై శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నూతన టీచింగ్ మెథడ్లపై, నూతన పరిశోధనలపై, ముఖ్యంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టం , నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన కరికులం డెవలప్మెంట్ వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సెమినార్లు, వర్క్ షాప్‌లు, లెక్చర్-సిరీస్‌లు, సంబంధిత అంశాలపై లోతైన చర్చలు నిర్వహించడం. భారత విద్యావిధానంపై, జాతీయ విద్యా విధానంలో నూతన పోకడలపై, టీచింగ్ మెథడ్లపైన, అధ్యాపకులు పుస్తకాలు ప్రచురించేందుకు తగిన సలహాలు సూచనలు అందించడమే కాక, 'షేక్ మంతన్' అనే మాసపత్రిక ప్రచురిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై ఏబీఆర్‌ఎస్‌ఎం తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో ఆ విధానాలు సరిగా ఉన్నాయా లేవా, లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తుంది.

ఏబీఆర్ఎస్‌యం లక్ష్యాలు..

ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు కార్యకర్తలకు 'అభ్యాస్ వర్గ్'ను నిర్వహించడం. విశ్వవిద్యాలయ, కళాశాల రాష్ట్ర, అఖిల భారత స్థాయిలో ఉపాధ్యాయ సదస్సులు నిర్వహించడం. 'వింగ్ ల వారీగా' (ప్రైమరీ,, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్,, ఉమెన్, ఇంజినీరింగ్ & టెక్నాలజీ, ఫార్మసీ, రెసిడెన్షియల్, విశ్వవిద్యాలయాలు, జాతీయ పరిశోధనా సంస్థలు, ఎంబీఏ వింగ్‌లు) ఏర్పాటు చేసి ఆయా విభాగాలలో ఉన్న సమస్యలపై సదస్సులు, కార్యవర్గాలు నిర్వహించడం. విద్యలో జాతీయవాదానికి సంబంధించిన 'థింకింగ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్' నిర్వహించడం. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యాసంస్థల ఏర్పాటు, సామాన్య మధ్య తరగతి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో కూడిన యూనివర్సిటీల ఏర్పాటు సంస్థ లక్ష్యాల్లో కొన్ని. జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉన్నతమైన స్థాయిలో ఉండేందుకు, మన జాతీయ విద్యా వ్యవస్థను ప్రపంచ విద్యా వ్యవస్థలను తలదన్నేలా రూపొందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది.

(సెప్టెంబర్ 20-21 తేదీల్లోఓయూలో జాతీయ సెమినార్ సందర్భంగా)

డాక్టర్ చేగొని రవికుమార్

అసిస్టెంట్ ప్రొఫెసర్

98669 28327

Tags:    

Similar News