ఇఫ్తారు విందు ఏర్పాట్ల వేళ తీవ్ర విషాదం
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.

దిశ, శంకరపట్నం : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని మక్త గ్రామానికి చెందిన ఎస్కే. అజీమ్ (37), అతని కుమారుడు రెహమాన్(12) శుక్రవారం ఇఫ్తార్ విందు కోసం కేశవపట్నం వచ్చి సరుకులను తీసుకొని స్వగ్రామం మక్తకు వెళ్తుండగా కేశవపట్నం రహదారిపై బస్టాండుకు ఎదురుగా కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో మృతదేహాలను హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.