ఏసీబీ వలలో సెబ్ సీఐ, ఎస్సై

Update: 2023-06-08 11:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మురళి అవినీతి నిరోధక శాఖ అధికారులు పన్నిన వలలో చిక్కారు. మద్యం అక్రమ రవాణా కేసులో రూ.15,000 లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జి.సిగడాం మండలం నిద్దంకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మే 25న 5 మద్యం సీసాలను తీసుకెళ్తుండగా పొందూరు సమీపంలో ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అయితే స్థానిక పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీనిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని సీఐ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రూ. 15 వేలు ఇస్తే అతడికి బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంత నగదు ఇవ్వలేని పరిస్థితుల్లో రూ. 5వేల రూపాయలు ఇచ్చి.. తన కేసును మరొకరిపై నమోదు చేసేందుకు అతడే మరో వ్యక్తిని తీసుకుని రావాలని నిందితుడితో సీఐ అన్నారు.

అయితే నిందితుడు నగదు ఇవ్వకపోవటంతో రోజూ అతడిని స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. దీంతో విసుగు చెందిన నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నిందితుడు ఎస్​ఈబీ సీఐకీ ఫోన్​ చేసి అడిగిన నగదును ఇస్తానని చెప్పాడు. అయితే తాను విశాఖపట్నంలో ఉన్నానన డబ్బులను స్టేషన్‌లో ఉన్న ఎస్​ఐకు ఇవ్వమని సీఐ శ్రీనివాసరావు చెప్పారు. దీంతో నిందితుడు పోలీస్​ స్టేషన్‌కు వెళ్లి ఎస్​ఐ మురళికి రూ. 15 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశాఖలో ఉన్న శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు పొందూరు తీసుకొచ్చారు. సీఐ,ఎస్ఐలను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్​‌కు తరలించినట్లు శ్రీకాకుళం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి మీడియాకు తెలిపారు.

Tags:    

Similar News