ఫైనాన్స్ వ్యాపారి ప్రాణాలు తీసిన మూలమలుపు

బైరాగులపాడు పెట్రోల్ బంకు సమీపంలోని మూలమలుపు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కొవ్వూరి రాజశేఖర్ మృతి చెందారు

Update: 2022-12-15 04:39 GMT

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని బైరాగులపాడు పెట్రోల్ బంకు సమీపంలోని మూలమలుపు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కొవ్వూరి రాజశేఖర్ మృతి చెందగా, ఆయన భార్య శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. చర్ల గ్రామానికి చెందిన ఈ దంపతులు భద్రాచలంలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై 10 గంటల సమయంలో తిరిగి తమ గ్రామమైన చర్లకు బయలుదేరారు. ఈ క్రమంలో బైరాగులపాడు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న రోడ్డు మూలమలుపులో టీఎస్ 04 ఈ ఏ 8886 నెంబరు గల వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని భార్య శ్రీలతకు తీవ్ర గాయాలు కాగా భద్రాచలంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. దుమ్ముగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. 


Similar News