భారీ వర్షాల వేళ.. సిద్ధిపేటకు ‘హై అలర్ట్’.. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్..

దిశ, సిద్దిపేట: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అదనపు కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, అన్ని ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని చెరువు కట్టలను, అలుగు, తూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, ఆవులు, […]

Update: 2021-08-30 05:35 GMT

దిశ, సిద్దిపేట: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అదనపు కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, అన్ని ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని చెరువు కట్టలను, అలుగు, తూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, ఆవులు, ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నీట మునిగిన వారిని, ఇండ్లు కూలిన వారిని, శిథిలావస్థలో, కూలే స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించి వారిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అంతేకాకుండా వారికి భోజన వసతి కల్పించాలని తెలిపారు. పూర్తిగా ఇండ్లు ధ్వంసం అయిన వారికి ప్రభుత్వ పరంగా అందించే ఆర్థిక సహాయం వెంటనే అందేలా చూడాలన్నారు. బాధితులకు రేషన్ బియ్యం అందజేయాలన్నారు.

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల వద్దకు సందర్శకులు రాకుండా చూడాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి ఫ్లడ్‌ ప్రోటోకాల్‌ను పాటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. లో లెవల్‌ బ్రిడ్జ్‌, కాజ్‌వేలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని ప్రతి లో లెవల్‌ బ్రిడ్జ్‌, కాజ్‌వేల వద్ద గ్రామ సేవకులను, ఇంజనీరింగ్ అధికారిని కాపలా ఉంచాలన్నారు. ప్రమాద సంకేతంగా ఎర్రజెండాలు పాతి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వాహనాలు, పాదచారులు రాకపోకలను నియంత్రించాలన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

భారీ వర్షాలతో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎప్పటికప్పుడు రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, కుంటలు, విద్యుత్ స్తంభాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. వచ్చే రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాను, జిల్లా అదనపు కలెక్టర్, సహాయ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు అర్థరాత్రి వరకు అధికారులకు అందుబాటులో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పంచాయితీ రాజ్, ఆర్అండ్‌బీ శాఖల అధికారులకు నేడు, రేపు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ క్షేత్ర ప్రగతిని సమీక్షించాలన్నారు.

Tags:    

Similar News