ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ తెలుగు పాటల రచయిత కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు.

Update: 2024-09-12 07:21 GMT

దిశ, సినిమా: టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన కాలు జారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ లాంటి సూపర్ హిట్ పాటలను రచించిన ప్రముఖ గీత రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. ఈయన అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. ఎం.ఎ. చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్‌బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్‌తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు. అలా కలెక్షన్ కింగ్ నటించిన చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను ఈయన రచించారు. కాగా ఇతని మరణవార్త విన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


Similar News