ఆమె మైనర్‌గా ఉన్నప్పడు లైంగిక దాడి చేశాననేది అబద్ధం: జానీ మాస్టర్‌ షాకింగ్ స్టేట్‌మెంట్

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం జానీ మాస్టర్‌ను పోలీసులు విచారించారు.

Update: 2024-09-28 09:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం జానీ మాస్టర్‌ను పోలీసులు విచారించారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే పోలీసుల కస్టడీలో జానీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

పోలీసుల విచారణలో శుక్రవారం పాల్గొన్న జానీ మాస్టర్‌ కాస్త అనారోగ్యంగా ఉన్నారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించారు. పోలీసుల విచారణలో భాగంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో జానీ మాస్టర్‌ ఏకీభవించలేదని తెలుస్తోంది. తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్‌ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని జానీ పేర్కొన్నాడు. అయితే, తను మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని చెప్పాడు. తన టాలెంట్‌ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానన్నాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను మానసికంగా హింసించేదని జానీ మాస్టర్‌ తెలిపాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించినట్లు తెలిపాడు. దీంతో ఈ సమస్యను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాగా బాధితురాలితో మాట్లాడారు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నాడు. తనపై కుట్ర జరిగిందని, తన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నాడు. తన ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కాగా సెప్టెంబర్ 28న జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుండగా తాజాగా అక్టోబర్ 3 వరకు పొడిగించినట్లు తెలుస్తోంది.


Similar News