నేటి నుంచి JEE Mains రెండో విడత దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీలివే
దేశవ్యాప్తంగా NIT, IIT బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ (Joint Entrance Examination JEE Main-2025) సెషన్-1 పరీక్షలు ముగిశాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా NIT, IIT బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ (Joint Entrance Examination JEE Main-2025) సెషన్-1 పరీక్షలు ముగిశాయి. మొత్తం ఐదు రోజుల పాటు రోజుకు రెండు విడతల్లో మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. త్వరలో ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. దానిపై అభ్యంతరాలను స్వీకరించి పర్సంటైల్ స్కోర్ను ఫిబ్రవరి 12న ప్రకటించనున్నారు. ఇక జనవరి 31 నుంచి సెషన్-2 పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్( https://jeemain.nta.nic.in/ )లో విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇక ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన విడుదల చేసింది. సెషన్-1 పరీక్షలకు దేశ వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. సెషన్-2కు దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే జేఈఈ మెయిన్ రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్డ్ 2025 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
ఇక, మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో NITలు, అడ్వాన్స్డ్ ర్యాంకులతో IITల్లో సీట్లు పొందొచ్చనే విషయం తెలిసిందే. కాగా జేఈఈ మెయిన్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 NITల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో.. జేఈఈ అడ్వాన్స్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 23 IITలు, IIITల్లో సీట్లు కేటాయిస్తారు.