TAX: ఐటీ రిటర్నుల దాఖలులో సరికొత్త రికార్డు.. జులై 31 నాటికి ఎన్నంటే..

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సరికొత్త రికార్డు నమోదైంది.

Update: 2024-08-02 10:41 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సరికొత్త రికార్డు నమోదైంది. 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి జులై 31 నాటికి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలైనట్లు ఐటీ శాఖ పేర్కొంది. గత ఏడాది దాఖలైన 6.77 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 50 లక్షల రిటర్నులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం రిటర్నుల దాఖలుకు చివరి రోజైన జులై 31 నాటికి వచ్చిన 7.28 కోట్ల రిటర్నుల్లో అత్యధికంగా 5.27 కోట్లు కొత్త పన్ను విధానంలో రాగా, పాత పన్ను విధానంలో కేవలం 2.01 కోట్లు వచ్చాయి. ఈ విధంగా చూసినట్లయితే దాదాపు 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోగా, 28 శాతం మంది పాత పన్ను విధానంలోనే కొనసాగుతున్నారు.

రిటర్నుల దాఖలుకు చివరి రోజు దాదాపు 69.92 లక్షల రిటర్నులు ఫైల్ అయ్యాయి. పోర్టల్‌లో జులై 31న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అత్యధికంగా 5.07 లక్షల ఐటీఆర్ ఫైలింగ్‌లు వచ్చినట్లు డేటా తెలిపింది. మొత్తం పన్ను దాఖలులో 58.57 లక్షల మంది మొదటిసారి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు. పన్ను పరిధి పెరిగిందడానికి ఇదే నిదర్శనమని ఐటీ శాఖ పేర్కొంది. మొత్తం 6.21 కోట్లు ఈ-వెరిఫై అయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో ఐటీ రిటర్నుల గురించి ప్రచారం చేయడంతో పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్న్‌లను ముందుగానే ఫైల్ చేశారని ఐటీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News