EV cars: టాటా మోటార్స్ బంపర్ ఆఫర్.. ఈవీలపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు

పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలను పెంచుకోవడానికి ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలపై తగ్గింపును ప్రకటించింది.

Update: 2024-09-10 15:14 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలను పెంచుకోవడానికి ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలపై తగ్గింపును ప్రకటించింది. ‘ఫెస్టివల్‌ ఆఫ్ కార్స్‌’ పేరుతో ఈవీ కార్లపై గరిష్టంగా రూ.3 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి ధరల తగ్గింపు ఉంది. Nexon EVకి రూ. 3 లక్షల వరకు, పంచ్ EVకి రూ. 1.20 లక్షల వరకు, టియాగో EVకి రూ. 40,000 వరకు ధర తగ్గింపు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పరిమిత కాలపు ఆఫర్.. అంటే కొద్ది రోజుల వరకు మాత్రమే తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ పండుగ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు త్వరగా దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించాలని టాటా మోటార్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే, ఆఫర్‌లో భాగంగా టాటా పవర్‌ చార్జింగ్‌ పాయింట్ల వద్ద ఆరు నెలల వరకు ఉచిత చార్జింగ్‌ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా 5,500 టాటా పవర్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. తగ్గింపు ధరలతో టాటా టియాగో EV ఇప్పుడు రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది, పంచ్ EV ధర రూ. 9.99 లక్షలు, Nexon EV రూ. 12.49 లక్షలతో ప్రారంభమవుతుందని టాటా గ్రూప్ పేర్కొంది. ఈ తగ్గింపు ఆఫర్‌, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత వేగవంతం చేస్తుందని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు.అలాగే, పెట్రోల్/డీజిల్-ఆధారిత వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యమని అన్నారు.


Similar News