Tata Electronics: పెగట్రాన్లో మెజారిటీ వాటా సొంతం చేసుకున్న టాటా కంపెనీ
ఎంత మొత్తానికి ఒప్పందం జరిగిందనే అంశంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ దేశీయంగా ఐఫోన్ల తయారీ విషయంలో దూకుడుగా ఉంది. గతేడాది ఐఫోన్ల తయారీ కాంట్రాక్ట్ కంపెనీ విస్ట్రాన్ను సొంతం చేసుకుంది. తాజాగా తైవాన్కు చెందిన పెగట్రాన్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ అయిన పెగట్రాన్ ఇండియాలోని 60 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఎంత మొత్తానికి ఒప్పందం జరిగిందనే అంశంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ కొనుగోలుతో టాటా ఎలక్ట్రానిక్స్ దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీలో ముందడుగు వేసిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఇరు కంపెనీలు కలిసి ఐఫోన్లతో పాటు దేశీయ తయారీపై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా పెగట్రాన్లో మెజారిటీ వాటాను దక్కించుకోవడం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీలో టాటా సంస్థ ఉనికి మరింత పటిష్టమవుతుందని కంపెనీ సీఈఓ రణ్ధీర్ ఠాకూర్ తెలిపారు. ఏఐ, డిజిటల్ కొత్త టెక్నాలజీతో కూడిన తయారీ కోసం సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తుల్లో కొత్త ఫెసిలిటీస్తో పాటు కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఆయన వివరించారు. కాగా, పెగాట్రాన్, విస్ట్రాన్ కాకుండా టాటా ఎలక్ట్రానిక్స్ తమిళనాడులోని హోసూర్లో మరో ప్లాంట్ను కూడా నిర్మిస్తోంది. ఇది దేశంలో తన ఐఫోన్ తయారీని విస్తరణ కోసం ఏర్పాటు చేస్తోంది.