Stock Market: వారాంతం అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లభించడం, కీలక రంగాల్లో కొనుగోళ్ల ఉత్సాహం వంటి పరిణామాలు అధిక లాభాలకు కారణమయ్యాయి.

Update: 2024-08-09 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాలు నమోదయ్యాయి. ఈ వారం మొత్తం రికార్డు గరిష్ఠాలు, రికార్డు పతనాలను చూసిన సూచీలు వారాంతం మెరుగైన ర్యాలీతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లభించడం, కీలక రంగాల్లో కొనుగోళ్ల ఉత్సాహం వంటి పరిణామాలు అధిక లాభాలకు కారణమయ్యాయి. ప్రధానంగా అమెరికాలో నిరుద్యోగ డేటా ఊహించిన దానికంటే తక్కువగా ఉండటం అక్కడ మాంద్యం భయాలను తగ్గించింది. ఈ ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లు రాణించాయి. అది మన మార్కెట్లకు కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా దేశీయ ఐటీ షేర్లలో పెద్ద ఎత్తున షేర్ల కొనుగోలుకు కారణమైంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 819.69 పాయింట్లు ఎగసి 79,705 వద్ద, నిఫ్టీ 250.50 పాయింట్లు లాభపడి 24,367 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, మీడియా, ఐటీ, ఆటో రంగాలు దాదాపు 2 శాతం వరకు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలను సాధించాయి. కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.96 వద్ద ఉంది. 

Tags:    

Similar News