75 వేల పైకి సెన్సెక్స్

ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కోసం సన్నద్ధమవుతుండటమే ఈ లాభాలకు కారణం.

Update: 2024-06-06 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనం తర్వాత క్రమంగా కోలుకుంటున్నాయి. అంతకుముందు సెషన్‌లో మూడేళ్లలో మెరుగైన వన్-డే ర్యాలీ చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లోనూ పుంజుకున్నాయి. సుమారు 1 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కోసం సన్నద్ధమవుతుండటమే ఈ లాభాలకు కారణం. రెండు మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టనుండటంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 692.27 పాయింట్లు ఎగసి 75,074 వద్ద, నిఫ్టీ 201.05 పాయింట్లు లాభపడి 22,821 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, మీడియా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఎల్అండ్‌టీ, విప్రో, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.47 వద్ద ఉంది.


Similar News