Retail Inflation: ఐదేళ్ల కనిష్టానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

2019 తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతం దిగువన నమోదవడం ఇదే మొదటిసారి.

Update: 2024-08-11 18:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా దిగి వచ్చింది. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి ఏకంగా ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గింది. సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నెలలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) అధారిత ద్రవ్యోల్బణం 3.54 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడం ఇందుకు కారణం. దీంతో 2019 తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతం దిగువన నమోదవడం ఇదే మొదటిసారి. అంతకుముందు జూన్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం ఆహార పదార్థాల ధరల ప్రభావంతో 5.08 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సీపీఐ రేటు 7.44 శాతంగా ఉంది. ప్రభుత్వ డేటా ఆధారంగా జూన్‌లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 9.36 శాతం నుంచి జూలైలో 5.42 శాతానికి దిగొచ్చింది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం 29.32 శాతం నుంచి 6.83 శాతానికి తగ్గింది. అలాగే, గ్రామీణ ద్రవ్యోల్బణం 5.66 శాతం నుంచి జూలైలో 4.10 శాతానికి తగ్గింది. పట్టణ ద్రవ్యోల్బణం కూడా జూన్‌లో 4.39 శాతం నుంచి జూలైలో 2.98 శాతానికి తగ్గిపోయింది.  

Tags:    

Similar News