అమ్మకానికి డిస్నీ+ హాట్స్టార్.. రిలయన్స్తో చర్చలు!
అమెరికాకు చెందిన ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ తన ఇండియా స్ట్రీమింగ్, టెలివిజన్ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది.
దిశ, వెబ్డెస్క్: అమెరికాకు చెందిన ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ తన ఇండియా స్ట్రీమింగ్, టెలివిజన్ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది. దీని కోసం దేశంలోని పలు కంపెనీల అధికారులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ రేసులో ప్రధానంగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ కోసం చర్చలు కూడా జరిపినట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఈ డీల్లో డిస్నీ+ హాట్స్టార్, స్పోర్ట్స్ రైట్స్లను పూర్తిగా విక్రయించాలని లేదా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని వాల్ట్ డిస్నీ యజమాన్యం భావిస్తుంది.
ఇటీవల డిస్నీ+ హాట్స్టార్ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్) టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో డిస్నీ+ హాట్స్టార్ తన సబ్స్క్రైబర్లను కోల్పోతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో డిస్నీ తన పూర్తి స్థాయి వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది. డిస్నీ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి రిలయన్స్ సిద్ధంగా ఉన్నట్లు దీనికోసం సంబంధిత అధికారులతో చర్చలు కూడా జరిగినట్లు ఈ విషయం గురించి తెలిసిన ప్రతినిధి పేర్కొన్నారు.