వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్.. రెపో రేటు 6.5 శాతం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు

Update: 2024-06-07 05:59 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటు 6.5 శాతం వద్దే ఉంచారు. జూన్ 5 నుంచి 7 వరకు ఎంపీసీ సమావేశాలను నిర్వహించగా తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ కీలక నిర్ణయాలను ప్రకటించారు. మొత్తం ఆరుగురు సభ్యుల కమిటీలో 4:2 మెజారిటీ ప్రాతిపదికన రెపో రేటును వరుసగా ఎనిమిదోసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. ఆర్‌బీఐ చివరగా ఫిబ్రవరి 2023లో వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆర్‌బీఐ గవర్నర్, దేశంలో ద్రవ్యోల్బణం తగ్గటంతో పాటు, ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉందని, అయితే ఆహార ద్రవ్యోల్బణం మాత్రం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో 1.03 శాతం పెరుగుదలను ఎదుర్కొంటుండగా, ఏప్రిల్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 0.59 శాతం పెరుగుదల కనిపించింది, ఇది జాతీయ ఆహార ద్రవ్యోల్బణం 0.74 శాతం పెరుగుదలకు దారితీసింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2024లో 11 నెలల కనిష్టానికి 4.83 శాతానికి చేరుకోవడంతో బలమైన వృద్ధి ఊపందుకుంది. వస్తువుల ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని దాస్ చెప్పారు.

ఖరీఫ్ సీజన్‌‌లో అనుకూలమైన రుతుపవనాల కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచానాలు ఉండటంతో ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చని ఆయన అన్నారు. అలాగే, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం కిందికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సేవల కార్యకలాపాలలో స్థిరమైన ఉత్సాహం పట్టణ వినియోగానికి మద్దతిస్తుందని అన్నారు. బ్యాంకులు, కార్పొరేట్‌ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్‌లు, అధిక సామర్థ్య వినియోగం పెట్టుబడి కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటాయని దాస్ అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీడీపీ (స్థూల దేశీయ వృద్ధి) వృద్ధి రేటు 7.2 శాతానికి సవరించారు. ఇది అంతకుముందు ఊహించిన 7 శాతం నుండి పెరిగింది. అదే త్రైమాసిక పరంగా చూసుకుంటే వృద్ధి అంచనాలు మొదటి త్రైమాసికంలో 7.3 శాతం, రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో త్రైమాసికంలో 7.3 శాతం, నాలుగో త్రైమాసికంలో 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.


Similar News