రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రూ. 3 కోట్లకు పెంచిన ఆర్‌బీఐ

దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టు దాస్ పేర్కొన్నారు.

Update: 2024-06-07 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ముగిసిన ఎంపీసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి బల్క్ ఎఫ్‌డీల నిర్వచనాన్ని సవరించాలని ప్రతిపాదించినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ. 2 కోట్ల కంటే ఆపైన డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తున్నారు. ఆలోపు ఉంటే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా భావిస్తారు. దీన్ని రూ. 3 కోట్లకు పెంచనున్నారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టు దాస్ పేర్కొన్నారు. సాధారణంగా బ్యాంకులు రిటైల్ ఎఫ్‌డీల కంటే బల్క్ ఎఫ్డీలపై తక్కువ వడ్డీని ఇస్తుంటాయి. తాజా ఆర్‌బీఐ నిర్ణయంతో రూ. 3 కోట్ల వరకు ఎఫ్‌డీల్లో మదుపు చేసే వారికి శిభవార్త కానుంది. ఈ మార్పు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు వర్తించనున్నాయి. దీంతో పాటు తక్కువ మొత్తం డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్‌లో ఆటోమెటిక్ క్యాష్ లోడ్ సదుపాయాన్ని తీసుకురానుంది. దీనివల్ల యూపీఐ లైట్ చెల్లింపులు మరింత పెరుగుతాయని భావిస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఫాస్టాగ్‌కు కూడా ఇదే తరహా విధానాన్ని ప్రతిపాదించింది.  


Similar News