Renewable energy: 1,234 కోట్ల యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన NLCIL

ప్రభుత్వ యాజమాన్యంలోని లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎల్‌సీఐఎల్(NLCIL) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,234 కోట్ల యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2024-09-28 10:52 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ యాజమాన్యంలోని లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎల్‌సీఐఎల్(NLCIL) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,234 కోట్ల యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా దాదాపు కోటి టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను నిరోధించినట్లయిందని పేర్కొంది. గ్రీన్ పవర్ ఉత్పత్తిలో భాగంగా సంస్థ సౌర విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ ప్లాంట్‌ల ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం NLC ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ (NIRL), NLC ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NIGEL) అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది.

మొదటగా సంస్థ 1,380 MW సౌర విద్యుత్ ప్లాంట్లు, 51 MW పవన విద్యుత్ ప్లాంట్‌లతో పునరుత్పాదక శక్తిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. నేవేలి (తమిళనాడు), బార్సింగ్‌సర్ (రాజస్థాన్), గుజరాత్, అస్సాంలలో ముఖ్యమైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా సంస్థ 2030 నాటికి 10,000 MW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధిండం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే, గత నెలలో, NLCIL కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (CPSU) పథకం కింద పోటీ ధరలో 200 MW సౌరశక్తి కోసం తెలంగాణ రాష్ట్ర డిస్కమ్‌లతో 25 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది.


Similar News