ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్లపై నాస్కామ్ ఆందోళన

కర్ణాటకలో ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసరి చేసే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలపడంతో దీనిపై తాజాగా సాఫ్ట్‌వేర్ బాడీ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది

Update: 2024-07-17 11:38 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కర్ణాటకలో ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసరి చేసే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలపడంతో దీనిపై తాజాగా సాఫ్ట్‌వేర్ బాడీ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య కారణంగా రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ, దానిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ పరిశ్రమల్లో కన్నడిగులకు నాన్‌ మేనేజ్‌మెంట్ కోటాలో 70 శాతం, మేనేజ్‌మెంట్ కోటాలో 50 శాతం పోస్టులను కేటాయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

బిల్లులోని నిబంధనలు కంపెనీలను, స్టార్టప్‌లను తరిమికొట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా మరిన్ని ప్రపంచ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న సమయంలో అవి తమ పెట్టుబడి ప్రాంతాలను మార్చుకుంటాయని నాస్కామ్ పేర్కొంది. స్థానిక నైపుణ్యం కలిగిన ప్రతిభ కొరత కారణంగా కంపెనీలు ఇతర చోట్లకు వెళ్ళిపోతాయి. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో అభివృద్ధి నిలిచిపోతుందని ఐటీ పరిశ్రమకు చెందిన నాస్కామ్ తెలిపింది.

కర్ణాటక పురోగతి పట్టాలు తప్పకుండా ఆపడానికి రాష్ట్ర అధికారులతో పరిశ్రమల ప్రతినిధుల అత్యవసర సమావేశాన్ని నాస్కామ్ ప్రతినిధులు కోరారు. కీలకమైన టెక్నాలజీ హబ్‌గా ఉన్న రాష్ట్రంలో ఈ చర్యతో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయి, పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించింది. పలువురు పరిశ్రమల ప్రముఖులు కూడా ఈ చర్యను వివక్షతో కూడుకున్నదని వ్యతిరేకించారు. టెక్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కర్ణాటక జీడీపీలో టెక్నాలజీ రంగం దాదాపు 25 శాతం వాటాను అందిస్తుంది.


Similar News