Maruti Suzuki: వాహనాల ధరలు పెంచిన మారుతీ సుజుకి, టాటా మోటార్స్
ఈ పెంపు వాహన మోడల్, వేరియంట్ని బట్టి వేర్వేరుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: వాహన ప్రియులకు ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించినిద్. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ వ్యయం కారణంగా వచ్చే నెల నుంచి ఈ పెంపు నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. గరిష్టంగా 4 శాతం వరకు ఈ పెరుగుదల ఉంటుందని, మోడల్ని బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ వివరించింది. వాహనాలను తయారు చేయడంలో ఉత్పత్తి ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయని, సాధ్యమైనంత వరకు వినియోగదారులపై ఆ భారాన్ని బదిలీ చేయకుండా ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కానీ, ఎప్పటికప్పుడు పెరుగుతున్న కార్యకలాపాల వ్యయం వల్ల కొంత భాగం బదిలీ చేస్తున్నట్టు మారుతీ సుజుకి తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో మారుతీ సుజుకి గడిచిన రెండు నెలల్లో రెండోసారి ధరలను పెంచింది. ఫిబ్రవరిలోనే మోడల్ని బట్టి గరిష్ఠంగా రూ. 32 వేల వరకు పెంపును ప్రకటించిన తర్వాత ఈసారి మరో 4 శాతం వరకు పెంచడం గమనార్హం. మరో దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సైతం తన కమర్షియల్ వాహనాల ధరలను 2 శాతం మేర పెంచుతూ సోమవారం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పెంపు వాహన మోడల్, వేరియంట్ని బట్టి వేర్వేరుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ వ్యయం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక ముడిసరుకు, లాజిస్టిక్స్ ఖర్చుల ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది.
Read More..