Infosys Q2 Results: రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్.. లాభం రూ. 6,506 కోట్లు.. ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండ్‌..!

భారతదేశం(India)లోని దిగ్గజ కంపెనీలు గత కొన్ని రోజులుగా జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-18 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని దిగ్గజ కంపెనీలు గత కొన్ని రోజులుగా జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌(Infosys) త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ లాభం 4.7 శాతం పెరిగి రూ. 6,506 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ.6,212 కోట్లుగా ఉందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది.

ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం 5.1 శాతం పెరిగి రూ.38,994 కోట్ల నుంచి రూ.40,986 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో 1-3 శాతం మధ్యలో ఆదాయ వృద్ధి ఉంటుందని అంచనా వేసిన ఇన్ఫోసిస్‌.. తాజాగా దీనిని 3 శాతం నుంచి 4 శాతానికి సవరించింది. మరోవైపు, గత ఆరు త్రైమాసికాలుగా తగ్గుతూ వచ్చిన కంపెనీ ఉద్యోగులు గత త్రైమాసికంలో పెరిగారు. సెప్టెంబర్‌ చివరి నాటికి కొత్తగా 2,500 మంది సిబ్బంది సంస్థలో చేరారు. దీంతో సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,17,788కు చేరింది. అలాగే వలసల రేటు 12.7% నుంచి 12.9 శాతానికి పెరిగింది. ఇక రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాల సందర్భంగా తమ షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.21 చొప్పున మధ్యంతర డివిడెంట్(Interim Dividend) చెల్లిస్తామని ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అక్టోబర్ 29ను రికార్డు తేదిగా నిర్ణయించింది.


Similar News