భారత ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా వృద్ధి చెందుతోంది: ఎన్ చంద్రశేఖరన్

భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా వృద్ధి చెందుతోందని, రాబోయే సంవత్సరాల్లో ఇదే విధమైన వృద్ధి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉందని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం అన్నారు.

Update: 2024-06-13 08:03 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా వృద్ధి చెందుతోందని, రాబోయే సంవత్సరాల్లో ఇదే విధమైన వృద్ధి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉందని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం అన్నారు. టీసీపీఎల్ వార్షిక సర్వసభ్య (ఏజీఎం) సమావేశంలో మాట్లాడిన ఆయన, పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా భారతదేశ వినియోగదారుల మార్కెట్ దీర్ఘకాలిక నిర్మాణాత్మక అవకాశాన్ని సూచిస్తుందని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా గ్రూప్‌కు చెందిన ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. 2023-2044 ఆర్థిక సంవత్సరానికి భారత్ 8.2 శాతం ఆర్థిక వృద్ధి రేటును కనబరుస్తుందని చంద్రశేఖరన్ అంచనా వేశారు.

భారత‌లో మధ్యతరగతి వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇది కంపెనీకి అవకాశాలను సృష్టిస్తుంది, ఈ దశాబ్దం చివరినాటికి దేశ మధ్యతరగతి జనాభా 30 శాతం నుండి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంటుందని, దాదాపు 300 మిలియన్ల మంది అదనంగా మధ్యతరగతి విభాగంలోకి ప్రవేశిస్తారని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024, 2025లో 3 శాతానికి పైగా వృద్ధిని కొనసాగించగలదని చంద్రశేఖరన్ ప్రాథమిక అంచనా వేశారు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL) గురించి మాట్లాడుతూ,కంపెనీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎజెండా బాగా పురోగమిస్తోందని అన్నారు. ఈ కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధితో రూ.15,206 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.


Similar News