India-Russia: రష్యా నుండి పెరిగిన ముడి చమురు దిగుమతులు

భారత్ గత రెండు నెలల్లో రష్యా నుండి గరిష్ట స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుందని ఒక నివేదిక పేర్కొంది.

Update: 2024-08-15 14:18 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ గత రెండు నెలల్లో రష్యా నుండి గరిష్ట స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుందని ఒక నివేదిక పేర్కొంది. అత్యధికంగా జూన్‌లో, రోజుకు 1.93 మిలియన్ బ్యారెల్స్ (బీపీడీ) ముడి చమురు దిగుమతులు జరిగాయి. అయితే జులైలో ఇది 1.81 మిలియన్ బ్యారెల్స్‌కు తగ్గిన్నప్పటికి, ఇతర నెలలతో పోలిస్తే ఈ రెండు నెలల్లో రష్యా నుంచి భారత్‌కు అధికంగా ముడిచమురు సరఫరా అయింది. మరోవైపు భారత్‌కు అతిపెద్ద సాంప్రదాయ సరఫరాదారులుగా ఉన్న ఇరాక్, సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు కనిష్ట స్థాయికి చేరడం గమనార్హం.

డేటా ప్రకారం, జూన్ నెలలో సౌదీ అరేబియా నుంచి భారత్‌కు ముడిచమురు సరఫరా 4,54,000 బీపీడీలుగా ఉంది, జులైలో 6,06,000 బీపీడీగా నమోదైంది. అదే, ఇరాక్ నుండి భారత్‌కు జూన్‌లో 8,01,000 బీపీడీలు, జులైలో 6,03,000 బీపీడీల చమురు సరఫరా అయింది.

2022లో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా భారత్‌కు అతిపెద్ద ముడి సరఫరాదారుగా మారింది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ఆ దేశం భారత్‌కు అతితక్కువ ధరలకు ముడి చమురును అందిస్తోంది. దాంతో భారత కంపెనీలు తమ వ్యయం చాలా వరకు తగ్గుతుందని భావిస్తూ, ఇరాన్, సౌదీ అరేబియా నుంచి కాకుండా రష్యా చమురును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. దీని ఫలితంగా భారత్‌కు రష్యా ముడి చమురు అధిక స్థాయిలో సరఫరా అవుతుంది.

Tags:    

Similar News