స్పెషల్ ఎఫ్డీ పథకాల గడువు పొడిగించిన ఐడీబీఐ బ్యాంక్!
ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ తన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల గడువును పొడిగించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ తన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల గడువును పొడిగించింది. 375 రోజులతో పాటు 444 రోజుల కాలవ్యవధికి సంబంధించి అమృత్ మహోత్సవ్ స్పెషల్ ఎఫ్డీ పథకాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా, తాజాగా దీన్ని అక్టోబర్ 31కి పొడిగించింది.
అధికారిక బ్యాంకు వెబ్సైట్ వివరాల ప్రకారం, 444 రోజుల కాలవ్యవధి కలిగిన అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ పథకంపై సాధారణ ఖాతాదారులకు 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం ఇస్తోంది. అలాగే, 375 రోజుల స్పెషల్ ఎఫ్డీపై సాధారణ ఖాతాదారులకు 7.10 శాతం వడ్డీ ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ అమలు చేస్తోంది.
గతవారం సవరించిన దాని ప్రకారం, ఐడీబీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి 3 శాతం నుంచి 6.80 శాతం వడ్డీని అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.