India: ప్రపంచ టాప్ 10 పర్యాటక ప్రదేశాల్లో భారత్: గజేంద్ర సింగ్ షెకావత్

ప్రపంచదేశాల్లో భారత్‌కు ఉన్న దృక్పథం కారణంగా ఐదేళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా అవతరించగలదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

Update: 2024-08-31 09:51 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచదేశాల్లో భారత్‌కు ఉన్న దృక్పథం కారణంగా ఐదేళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా అవతరించగలదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. శనివారం ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన పర్యాటక రంగం వృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయ పర్యాటకం త్వరలో ఆకాశాన్ని తాకుతుందని అంచనా వేశారు. గతంతో పోలిస్తే ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు.

ప్రజల్లో పెరిగిన ఖర్చు శక్తి, భారత్‌ను చూడాలని, ఇక్కడి సంస్కృతి గురించి తెలుసుకోవాలని ఇతర దేశాల వారు ఆసక్తి కలిగి ఉండటం, దేశంలోని ప్రజలు పని ఒత్తిడి నుంచి బయటపడటానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లడం వంటి చర్యల వలన రాబోయే రోజుల్లో దేశంలో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని, దీంతో ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఉపాధి కల్పన పెరుగుతుందని షెకావత్ చెప్పారు.

వివిధ సెర్చ్ ఇంజన్‌లలో భారత పర్యాటక ప్రాంతాల గురించి సెర్చింగ్ చేయడం 48 శాతం పెరిగింది. పర్యాటకానికి కొత్త గమ్యస్థానాలు, వనరులను సృష్టించడానికి పీపీపీ పద్ధతిలో సహకారం లభిస్తుందని, ప్రైవేట్ పెట్టుబడులు ఈ రంగంలో క్రమంగా పుంజుకున్నాయని, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు తమ పర్యాటక రంగాన్ని పెంచడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ సహకారం అందించడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర మంత్రి ఈ సమావేశంలో తెలిపారు.

అలాగే, రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం సహకారం 10 శాతం ఉంటుందని అంచనా వేశారు. ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన దేశంగా భారత్ ఎదగడానికి మన సంస్కృతి మనకు సహాయం చేస్తుందని మంత్రి అన్నారు.


Similar News