Adani: $4 బిలియన్లతో అదానీ డేటా సెంటర్ విస్తరణ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది

Update: 2024-09-28 09:27 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో దిగ్గజ కంపెనీలు ఈ వ్యాపారంపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ ఒకడుగు ముందుకేసి $4 బిలియన్లతో డేటా సెంటర్ విస్తరణ చేపట్టడానికి ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. డేటా సెంటర్ సేవలతో అదానీ గ్రూప్ తన అవసరాలను తీర్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలోని అదానీ కన్నెక్స్ ప్రై. లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్. వర్జీనియా-ఆధారిత EdgeConneX మధ్య జాయింట్ వెంచర్, ప్రస్తుతం 17 మెగావాట్ల (MW) డేటా సెంటర్ సామర్థ్యాన్ని నిర్వహిస్తోంది. దీనితో పాటు నిర్మాణ దశల్లో 210 MWల ప్రాజెక్ట్ జరుగుతుంది.

డేటా సెంటర్ సేవలకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో, అదానీ గ్రూప్ ఇప్పుడు 1 నుండి 1.5 గిగావాట్ల (GW) డేటా సెంటర్ సామర్థ్యాన్ని రాబోయే ఒకటి నుండి రెండు సంవత్సరాలలో సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో భారీ ఖర్చులకు సైతం వెనుకాడటం లేదు. అందుకే వేగంగా ఈ సామార్థ్యాన్ని సాధించడానికి అదనంగా $4 బిలియన్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

వ్యూహాత్మక మార్పులో భాగంగా డేటా సెంటర్ వ్యాపారంలోకి నిధులను మళ్లించడానికి ఇతర రంగాల్లో పెట్టుబడులు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం, అదానీ గ్రూప్ భారతదేశ డేటా సెంటర్ మార్కెట్‌లో కేవలం 2.5 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది, ఇది దాని ప్రస్తుత సామర్థ్యం 700 MW నుండి FY30 నాటికి 4 GWకి విస్తరిస్తుంది. ఈ విస్తరణ ద్వారా అదానీ పవర్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న విద్యుత్ ఉత్పత్తి రంగం అవసరాలు కూడా తీరుతాయి.


Similar News