TATA: ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌లో కొత్తగా 20 వేల ఉద్యోగాలు: ఎన్ చంద్రశేఖరన్

దేశీయ దిగ్గజ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది

Update: 2024-09-28 10:22 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. హోసూర్‌లోని కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌లో త్వరలో 20,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ శనివారం తమిళనాడులో చెప్పారు. పనపాక్కంలో టాటా మోటార్స్‌- జేఎల్‌ఆర్‌ రూ.9,000 కోట్లతో నిర్మించనున్న కొత్త తయారీ యూనిట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రశేఖరన్‌ హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌లో కొత్త నియామకాలను చేపట్టడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం, 20 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా ప్లాంట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 40,000కి చేరుతుందని అన్నారు. గత మూడేళ్లలో ఇక్కడ ఆధునిక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 15,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. మరో ఏడాదికి ఈ ప్లాంట్‌లో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య రెండింతలు అవుతుంది. వీరితో పాటు కంపెనీపై అనేక లక్షల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే, శనివారం చెన్నైకి 115 కిలోమీటర్ల దూరంలో పనపాక్కంలో టాటా మోటార్స్ కొత్త తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రాజెక్ట్ పెట్టుబడి విలువ రూ.9,000 కోట్లు. దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు, ఆయనతో పాటు డీఎంకే సీనియర్‌ మంత్రులు దురై మురుగన్‌, టీఆర్‌బీ రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌ మురుగానందం, టాటా సన్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Similar News