Kadapa: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం: తులసిరెడ్డి

వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, కొన్ని విద్యాలయాలు గంజాయి, డ్రగ్స్, మద్యం, బెట్టింగ్ కేంద్రాలుగా మారాయని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏసీసీసీ మీడియా ఛైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు...

Update: 2023-06-29 16:39 GMT

దిశ,కడప: వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, కొన్ని విద్యాలయాలు గంజాయి, డ్రగ్స్, మద్యం, బెట్టింగ్ కేంద్రాలుగా మారాయని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏసీసీసీ మీడియా ఛైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల పాలిట శకుని మేనమామ, కంస మేనమామగా తయారయ్యారన్నారు. పాఠశాల విద్యను శాటిలైట్, ఫౌండేషన్, ప్రి హైస్కూల్, హైస్కూల్స్ అని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3,4,5 తరగతులను ఎలిమెంటరీ పాఠశాలల నుంచి విడగొట్టి హైస్కూల్లో విలీనం చేయడం ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని విమర్శించారు. దీని వలన డ్రాప్ఔట్స్ పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఒడి పథకం ఒక తల్లికి, ఒక బిడ్డకే వర్తిస్తుందని చెప్పడం ద్వారా మిగతా బిడ్డలను బడికి పంపవద్దని పరోక్షంగా చెప్పినట్లుందని, ఇది తిరోగమన చర్యని తులసిరెడ్డి అభివర్ణించారు.

పాఠశాల విద్యలో తెలుగు మీడియంను రద్దు చేస్తూ 2019 నవంబర్ 20న జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 85 ఒక చారిత్రక తప్పిదమని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థులు అటు తెలుగు రాక, ఇటు ఇంగ్లీషు రాక రెంటికీ చెడ్డ రేవడిలా అవుతారన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు విద్యా దీవెన, వసతిదీవెన రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.77 ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని ధ్వజమెత్తారు. ప్రతి విద్యార్థి సత్య నాదేళ్లగా తయారవడం దేవుడెరుగు అని, గంజాయి, డ్రగ్స్, మద్యం, బెట్టింగ్ బాబులుగా మారకుండా చూస్తే అదే పదివేలని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు 

Tags:    

Similar News