ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో ట్విస్ట్..యూట్యూబర్‌ కోసం గాలింపు

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్తకోణం వెలుగు చూస్తోంది.

Update: 2023-11-20 05:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్తకోణం వెలుగు చూస్తోంది. ఇది ప్రమాదవ శాత్తు నెలకొన్నది కాదని ప్రచారం జరుగుతుంది. ఓ యూ ట్యూబర్ పార్టీ ఇవ్వడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆ యూట్యూబర్ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్‌లో లంగర్ వేసిన ఉన్న బోటులో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చాడని పోలీసులకు సమాచారం అందింది. ఆ సమయంలో మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గొడవే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ యూట్యూబర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నిప్పుపెట్టారంటున్న మత్స్యకారులు

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదంపై మత్స్యకారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ అగ్నిప్రమాదం కాదని ఆరోపిస్తున్నారు. ఎవరో కావాలనే నిప్పుపెట్టారని మత్స్యకారులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ జీవినాధారమైన బోట్లు కాలిపోవడంతో బాధిత మత్స్యకార కుటుంబాలు బోరున విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరిగిన ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

మంత్రి సీదిరికి సీఎం జగన్ కీలక ఆదేశాలు

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై లోతైన విచారణ జరపాలని ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వాలని మంత్రి సీదిరి అప్పలరాజును సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో మంత్రి సీదిరి అప్పలరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. అయితే ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదానికి ఓ యూట్యూబర్ ఇచ్చిన పార్టీయే కారణమని పోలీసులు మంత్రికి తెలియజేసినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిందిలా!

పగలు అంతా వేటాడి అలసిపోయిన గంగపుత్రులు గాఢనిద్రలోకి జారుకున్నారు. అయితే అర్థరాత్రి ఊహించని రీతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్‌లో నిలిపి ఉన్న ఓబోటులో ప్రారంభమైన మంటలు రెప్పపాటులో మిగిలిన బోట్లన్నింటికి వ్యాపించాయి. మత్స్యకారులుఈ ప్రమాదాన్ని గమనించే సరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దాదాపు 45కిపైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది. విశాఖకు చెందిన మత్స్యకారులకు చేపలవేటే జీవనాధారం. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడమే వారికి తెలుసు. సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు బోట్లను ఉపయోగిస్తుంటారు. చాలా మంది మత్స్యకారులకు వేటాడటం వచ్చు కానీ సొంతంగా బోట్లు లేని పరిస్థితి. అలాంటి వారు బోట్లను అద్దెకు తీసుకువచ్చి వేటాడతారు. ఇలా పగటిపూట మత్స్యకారులంతా వేటకు వెళ్లి రాత్రిపూట బోట్లను ఫిషింగ్ హార్బర్‌లో పెట్టి సేద తీరుతారు. అలా బోట్లను పెట్టిన ఫిషింగ్ హార్బర్‌లోనే ప్రమాదం జరగడంతో గంటల వ్యవధిలో 45కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News