ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్

రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీ సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-01 11:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీ సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఒక్కొక్కటిగా హామీలను అమలు చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. కందిపప్పు ధరను ఒకే నెలలో రెండు సార్లు నియంత్రించి రూ.160, రూ.150 తగ్గించి అందించిన ప్రభుత్వం ఇప్పుడు మరింత తగ్గించింది.

నేటి (అక్టోబర్ 1) నుంచి కిలో కందిపప్పు రూ.67, అరకిలో చక్కెర రూ.17 అందిస్తూ పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తెనాలిలో ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా చక్కెర, కందిపప్పు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 1.49 కోట్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు, చక్కెర అందజేయనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అరకిలో చక్కెర పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో ఏకంగా 4.32 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు ప్రకటించారు.


Similar News