ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై టీజీ ప్రభుత్వం ఫోకస్.. కసరత్తులు ప్రారంభం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు...

Update: 2024-10-16 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డేజేషన్ అసెంబ్లీ-2024 సమావేశంలో మాట్లాడారు. పరిపాలన, సర్వీసుల్లో ఏఐని వినియోగించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇదో డిజిటల్ విప్లవం అని వివరించారు. ఏఐ కారిడార్‌గా హైదరాబాద్-బెంగుళూరు మారనుందన్నారు. దేశంలో స్మార్ట్ ఫోన్లు, విద్యుత్తు వాహనాలు, ఇంటర్నెట్ కనెక్షన్లు భారీగా పెరగుతున్న నేపథ్యంలో సెమీ కండక్టర్ అవసరాలు విస్తృతమయ్యాయని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు 100 కోట్లకు, విద్యుత్ వాహనాలు కోటికి, ఇంటర్నెట్ కనెక్షన్లు 200 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. తెలంగాణలో స్టార్టప్ లకు అనుకూల వాతావరణం కల్పించామని, మౌలిక వసతుల విషయంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. తెలంగాణాలో ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు కార్యాలయాలు నెలకొల్పాయని వివరించారు. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ , మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ యూనిట్లను తెలంగాణాలో స్థాపించాలని కేంద్రాన్ని కోరారు. కృత్రిమ మేథ, సెమీకండక్టర్ రంగంల్లో నైపుణ్యం ఉన్న 3.5 లక్షల మంది ప్రతిభావంతులు ఉన్నందున తెలంగాణాకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా తెలంగాణాను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పది బిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ప్రముఖంగా ఉంటుందన్నారు.

సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని, ఎన్విడియా, క్వాల్ కామ్, బ్రామ్ కామ్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు, గ్లోబల్, లోకల్ మార్కెట్ల కోసం పనిచేసే స్టార్టప్‌లతో ముందుకు దూసుకెళ్తున్నామని వెల్లడించారు. టీ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలు కోసం దాదాపు రూ. 1600 కోట్లకు పైగా నిధులు అవసరమని కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలకు హైస్టీడ్ ఇంటర్నెట్, మల్టీ-ప్లే సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సేవలను నెలకు కేవలం రూ.300 లకే ఇవ్వడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఐటీ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలుగుతామని చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీ అంటే కేవలం ఇంటర్నెట్ అందించడం మాత్రమే కాదని ఇది గ్రామీణ వ్యాపార వృద్ధి, విద్య, వైద్య సేవల లభ్యతను మరింతగా పెంచడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అవుతుందని అన్నారు. అటవీ ప్రాంతాలకు సంబంధించి ఫైబర్ నెట్‌వర్క్ ‌కోసం అటవీ శాఖా అనుమతులు రావాల్సి ఉందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా తీసుకొని.. విధానపర నిర్ణయం తీసుకొని పాలసీని ఇనిషియేట్ చేస్తామన్నారు. దీని వల్ల అనేక టెలికాం మ్యానుఫ్యాక్చరర్స్ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అతి త్వరలో దీనిని తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటామన్నారు. 


Similar News