‘పట్టిసీమ వట్టిసీమన్న జగన్’..ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, తాగు నీరు విడుదల చేశారు.

Update: 2024-07-10 09:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, తాగు నీరు విడుదల చేశారు. మూడు గేట్లు తెరిచి 500 క్యూసెక్కులను వదిలారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..‘వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడం మా లక్ష్యం. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారు’ అన్నారు. పట్టిసీమ వట్టిసీమన్న జగన్..రైతులకు క్షమాపణ చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. చింతలపూడి ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 40 టీఎంసీలు ఉండాల్సిన చోట అర టీఎంసీ కూడా నీటి నిల్వ లేదని మండిపడ్డారు. చివరి ఎకరాకు కూడా నీళ్లు ఇచ్చేంత వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు పూడిక తీయకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. కాలువల నిర్వహణ పనులు ఫిబ్రవరి, మార్చిలో చేసేట్టు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.


Similar News