IMD:రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది.

దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేశాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న(శనివారం) పల్నాడు జిల్లా రావిపాడులో 43.7°C రికార్డు, 119 ప్రాంతాల్లో 41°C కు పైగా నమోదు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే శనివారం 14 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇవాళ(ఆదివారం) పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని.. 67 మండలాలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం-7, విజయనగరం-11, మన్యం-10, ఏలూరు-1, ఎన్టీఆర్ జిల్లాలోని 1 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని సూచించారు.