Marri Rajashekar: నా కులమే వైసీపీలో నాకు శాపమైంది.. మర్రి రాజశేఖర్ హాట్ కామెంట్స్
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ (YCP) రాజకీయంగా ఆటుపోట్లను ఎదుర్కొంటుంది.

దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ (YCP) రాజకీయంగా ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరుస రాజీనామాలతో ఆ పార్టీలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajashekar) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju)కు అందజేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా కులం వైసీపీ (YCP)లో తనకు శాపమైందని కామెంట్ చేశారు. పార్టీ నుంచి తాను వెళ్లిపోవడానికి ప్రధాన కారణం జగనేనని అన్నారు. వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదని.. చాలా చులకన భావంతో చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని.. ఎట్టకేలకు 2023 చివర్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఓడిపోయిన విడదల రజినీ (Vidala Rajini)ని చిలకలూరిపేట ఇంచార్జ్గా చేశారని, ఆమెను బలోపేతం చేసేందుకు తనను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. వైసీపీ (YCP)లో ఉండగా.. ఎంపీ కృష్ణదేవరాయలు (MP Krishnadevarayalu)పై కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేయించారని కామెంట్ చేశారు. త్వరలోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరబోతున్నట్లుగా మర్రి రాజశేఖర్ ప్రకటించారు. కాగా, ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు.