బెజవాడ దుర్గమ్మకు 18లక్షలతో మంగళసూత్రం

బెజవాడ కనక దుర్గమ్మకు ఓ భక్తుడు 18లక్షలతో తయారు చేయించిన బంగారు మంగళసూత్రాన్ని కానుకగా బహుకరించాడు.

Update: 2024-10-05 07:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : బెజవాడ కనక దుర్గమ్మకు ఓ భక్తుడు 18లక్షలతో తయారు చేయించిన బంగారు మంగళసూత్రాన్ని కానుకగా బహుకరించాడు.ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన కళ్లకుంట అంకులయ్య ,రాజేశ్వరి దంపతులు కొబ్బరి బొండాల కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన సంపాదనలో ప్రతీరోజు కొంత దాచిన అంకులయ్య అమ్మవారికి 18 లక్షల విలువ చేసే 203 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను తయారు చేయించి సమర్పించాడు. తన ఎన్నోఏళ్ల మొక్కు నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందని, మంగళ సూత్రాన్ని అమ్మవారి మెడలో వేయడం చూశాకే తనకు నిజమైన ఆనందమన్నారు.

తాజాగా అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. సుమారు 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు సౌరభ్ గౌర్ తెలిపారు. నవరాత్రుల్లో అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించే భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే, కడపకు చెందిన సీఎం రాజేష్ అనే భక్తుడు అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు కానుకలుగా అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను అందించారు. ఓ భ‌క్తుడు అమ్మ‌వారికి వెండితో చేసిన నెమ‌లి వాహ‌నాన్ని బ‌హూక‌రించాడు.  దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మతల్లికి తొలి రోజున నాలుగుకోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వాటికి తోడుగా 18లక్షల విలువైన 203 గ్రాముల బంగారు మంగళసూత్రం కానుకగా రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 


Similar News