చంద్రబాబు జైలు నుంచి అడుగుపెట్టిన క్షణం నుంచే జగన్ పతనం ప్రారంభం: అచ్చెన్నాయుడు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-10-31 06:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబును రాజకీయ కక్షసాధింపుతోనే అరెస్ట్ చేసి జైలుకు పంపారనే విషయం ప్రజలందరికీ తెలిసిందన్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టి లబ్ధిపొందాలను సీఎం వైఎస్ జగన్ కుట్రలు చేశారని ఆరోపించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఓ ఒక్కతప్పు చేయలేదని...అంతేకాదు పార్టీలో ఎవరు తప్పు చేసినా సహించరని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మహానుభావుడు అయిన చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యంతర బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే...రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో వైఎస్ జగన్ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని... బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనం ప్రారంభం అవుతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టులో తమకు న్యాయం జరిగిందని అన్నారు. తాము రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్దకు వెళ్తున్నామని.. ఇప్పటికే అక్కడ లోకేశ్ ఉన్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేది అందరం కూర్చుని చర్చిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

Read More:   చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: మధ్యంతర బెయిల్ మంజూరు 

Tags:    

Similar News