AP News:‘జగన్‌ మళ్లీ తిరుమల వెళ్తారు’.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Update: 2024-09-28 09:48 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదం పై పలువురు మంత్రులు, అధికారులు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం పై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. లడ్డూ కల్తీ వివాదంపై మేమే సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను విమర్శిస్తూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో గుడివాడ అమర్‌నాథ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను సీఎం చంద్రబాబు వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు.100 రోజుల పాలనలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే మాట్లాడుతున్నారని విమర్శించారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో నమ్మకంతో తిరుమలకు వెళ్లేవారికి డిక్లరేషన్‌ ఎందుకు అని గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. డిక్లరేషన్‌ ఇచ్చి తిరుమలకు వెళ్లడం అనేది జరగని పని అని అన్నారు. సమయం చూసుకుని జగన్‌ మళ్లీ తిరుమలకు వెళ్తారని తెలిపారు. అప్పుడు జగన్‌ను ఎవరు ఆపుతారో చూస్తామని స్పష్టం చేశారు.


Similar News