పురంధేశ్వరిపై నోరు పారేసుకుంటే మహిళలమే బుద్ధి చెప్తాం: ఎంపీ విజయసాయిరెడ్డికి సాధినేని యామిని వార్నింగ్

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి విమర్శలను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఖండించారు.

Update: 2023-11-08 07:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి విమర్శలను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఖండించారు. వైసీపీ నాయకులు దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారు అని మండిపడ్డారు. ఎంపీ విజయసాయిరెడ్డి గురివింద గింజ మాటలు మానుకోవాలి అని సూచించారు. బీజేపీ మీద, తమ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి అని మండిపడ్డారు. వైసీపీ నాయకులంటే డైవర్షన్ పాలిటిక్స్‌కి పెట్టింది‌ పేరు అని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే తమ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. కల్తీ మద్యంతో పేదలు చనిపోయింది వాస్తవం కాదా? అని నిలదీశారు. మైనింగ్, ఇసుక ద్వారా కోట్లు దోచుకున్నది నిజం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు ఇస్తే ఆ పథకాలకు మీ పేర్లు పెట్టుకున్నారు అని రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ మండిపడ్డారు.

వైసీపీ అవినీతిపై చర్చకు సిద్ధమా?

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరగ్గొట్టేలా వ్యవహరిస్తోందని సాధినేని యామని శర్మ ఆరోపించారు. చెత్త నుంచి మరుగుదొడ్ల వరకు పన్నులు వసూళ్లూ చేస్తున్నారన్నారు. విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మీ చేతకాని పాలనతో దేశంలోనే రాష్ట్రం పేరు చెడగొట్టారని ధ్వజమెత్తారు. ఎన్నికలలో ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చారని.. మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లల్లో అభివృద్ధి ఎంత చేశారో చెప్పే ధైర్యం ఉందా? అని సాధినేని యామిని శర్మ నిలదీశారు. మీ అవినీతి గురించి పెద్ద చిట్టా చెబుతున్నాం... చర్చకు రండి అని సవాల్ విసిరారు. సమాధానం చెప్పలేక తమ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తారా? అని నిలదీశారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, మంత్రులకు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? అని సాధినేని యామనిశర్మ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడిస్తున్నారా? అని ప్రశ్నించారు.

నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి 2016లో పార్లమెంట్ గడప తొక్కితే పురంధేశ్వరి 2004లోనే పార్లమెంట్‌లో అడుగు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామని శర్మ చెప్పుకొచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్న చరిత్ర జగన్‌ది అయితే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నా...ఒక్క అవినీతి మచ్చ కూడా దగ్గుబాటి పురంధేశ్వరిపై లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము వైసీపీకి ఉందా? అని నిలదీశారు. పైగా బెదిరించేలా తమ మహిళా నేత పై వ్యాఖ్యలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే అవినీతి చేయలేదని చెప్పండి..మీ నిజాయితీ నిరూపించుకునే ధైర్యం ఉందా?అని ఛాలెంజ్ చేశారు. ఇంకోసారి దగ్గుబాటి పురంధేశ్వరిపై నోరు పారేసుకుంటే .. తమ పార్టీ మహిళలు అంతా కలిసి వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి తగిన బుద్ధి చెప్తాం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News